నిప్పులాంటి దేశభక్తుడు..ఆయనలో గాడ్సే కనిపిస్తున్నాడు: జామియా షూటర్ను కీర్తించిన హిందూ మహాసభ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం. జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించిన జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై కాల్పులు జరిపిన రామ్భక్త్ గోపాల్ శర్మపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోంది హిందూ మహాసభ. ఆయనను నాథూరామ్ గాడ్సేతో పోల్చింది. నిఖార్సయిన, నిప్పులాంటి దేశభక్తుడని కీర్తిస్తోంది.
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా గురువారం న్యూఢిల్లీలో మహార్యాలీని నిర్వహించడానికి ప్రయత్నించిన జామియా మిల్లియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై గోపాల్ శర్మ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జామియా విద్యార్థి ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం గోపాల్ శర్మను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.
Recommended Video
ఈ ఘటన పట్ల హిందూ మహాసభ అధికార ప్రతినిధి గోపాల్ పాండే స్పందించారు. గోపాల్ శర్మ చేసిన పనికి తాను గర్విస్తున్నానని అన్నారు. విద్యార్థులు కోరుతున్నట్లుగా వారికి స్వాతంత్య్రాన్ని ప్రసాదించడానికి ప్రయత్నించాడని ప్రశంసించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న వారిని ఎలా ఎదుర్కోవాలో చూపించాడని, ఒక బాటను పరిచాడని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గోపాల్ శర్మలో ఓ నాథూరామ్ గాడ్సే కనిపిస్తున్నారని కితాబిచ్చారు.