పార్లమెంట్ వద్దకు ర్యాలీగా జమియా వర్సిటీ విద్యార్థులు, అడ్డుకొన్న పోలీసులు.. హై టెన్షన్
ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీతో హై టెన్షన్ నెలకొంది. జమియా వర్సిటీ నుంచి విద్యార్థులు ర్యాలీగా పార్లమెంట్ వద్దకు బయల్దేరారు. కానీ వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసుల మొహరింపు
జమియా ఇస్లామియా వర్సిటీలో భారీగా పోలీసులు మొహరించారు. పార్లమెంట్ వద్దకెళ్తున్న విద్యార్థులను ఓక్లా ఆస్పత్రి వద్ద నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ప్రతిస్పందించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులను వెళ్లనీయకుండా పెట్టిన బ్యారికేడ్ల నుంచి దూకే ప్రయత్నం చేశారు. విద్యార్థులు, పోలీసుల చర్యతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది.

హై టెన్షన్
సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లాలని జమియా కో ఆర్డినేషన్ కమిటీ, జమియా విద్యార్థులు అనుకొన్నారు. జాతీయ పౌరసత్వ రిజిష్టర్, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదులుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వర్సిటీలోనే ఆందోళన చేయాలని.. పార్లమెంట్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. కానీ ఆందోళనకారులు వినిపించుకోలేదు.

టియర్ గ్యాస్ ప్రయోగం
అనుమతి లేదని పోలీసులు అంటుంటే వినలేదు. తమకు రాజ్యాంగం హక్కు కల్పించిందని చెప్పారు. దీంతో పోలీసులు బ్యారికేడ్లతో భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు ముందుకురావడంతో టీయర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఒకానొక సందర్భంలో పోలీసులు-ఆందోళనకారులు ఎదురెపడటంతో సిచుయేషన్ సీరియస్గా మారింది.












Click it and Unblock the Notifications