కర్ణాటక మాజీ స్పీకర్ కాళ్లు మొక్కిన పవన్ కల్యాణ్: ఆయన ఓ జూనియర్ భగత్ సింగ్..!
బెంగళూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కాళ్లు మొక్కారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న కోలార్ జిల్లా శ్రీనివాసపుర తాలుకాలోని గౌనిపల్లిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గౌనిపల్లిలో ప్రఖ్యాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన ఆయన ఈ ఉదయం గౌనిపల్లికి చేరుకున్నారు. ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సరిహద్దు గ్రామంలో పవన్ కల్యాణ్..
పవన్ కల్యాణ్ తో పాటు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి గోపాలగౌడ, మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ కుమార్ సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌనిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. రమేష్ కుమార్ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరు కావడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ తల పెట్టిన నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రమేష్ కుమార్ చెప్పారు.
పవన్ కల్యాణ్ మీదే దృష్టి అంతా..
ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్ మీదే అహూతుల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉందని రమేష్ కుమార్ చెప్పారు. జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తాను అధ్యయనం చేశానని, పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార తీరును అనుక్షణం చూస్తూ వచ్చానని అన్నారు. పవన్ కల్యాణ్ కు ఎన్ని సీట్లు వచ్చాయనేది తనకు అనవసరమని, ఏపీలో ఎప్పటికైనా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పారు. అదే సమయంలో వేదిక మీద ముందు వరుసలో కూర్చున్న పవన్ కల్యాణ్ హఠాత్తుగా లేచి నిల్చున్నారు. రమేష్ కుమార్ కు పాదనమస్కారం చేశారు.
పవన్ కల్యాణ్ జూనియర్ భగత్ సింగ్..
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నంజావధూత స్వామి పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఆయనను జూనియర్ భగత్ సింగ్ గా అభివర్ణించారు. పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని, తన కోరిక నెరవేరాలని తాను వేణుగోపాలస్వామిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఒక్క ఏపీలో మాత్రమే కాకుండా.. పొరుగు దక్షిణాది రాష్ట్రాల్లో యువతకు పవన్ కల్యాణ్ స్ఫూర్తినిస్తున్నారని చెప్పారు. అసమాన పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారని, ఏపీలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఆయన పార్టీ ఘన విజయాన్ని సాధించాలని అభిలాషించారు.