అర్ధరాత్రి దాకా విచారణ, పొంతనలేని జవాబులతో విసుగెత్తించిన గాలి: పక్కా ప్లాన్తోనే..!
బెంగళూరు: బళ్లారి మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అంబిడెంట్ డీల్లో గాలి శనివారం వరకు పరారీలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం ఆయన అనూహ్యంగా బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. అంబిడెంట్ కంపెనీ తరఫున ఈడీకి లంచం ఇచ్చేందుకు మధ్యవర్తిత్వం నడిపిన ఆరోపణలను గాలి ఎదుర్కొంటున్నారు. చైన్ సిస్టం వ్యాపారంతో అంబిడెంట్ సంస్థ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడింది. దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ కేసులు కొట్టి వేయించేందుకు గాలి వారి నుంచి రూ.25 కోట్లకు బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతను పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
తాను ఎక్కడకూ వెళ్లలేదని, బెంగళూరులోనే ఉన్నానని ఆయన తన న్యాయవాదితో కలిసి వీడియో విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్లు మీడియా సంస్థలు ప్రచారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో కేంద్ర క్రైమ్ బ్రాంచ్ నుంచి నోటీసులు అందాయని, సీసీబీ ఎదుట హాజరవుతానని చెప్పారు. తాను తప్పు చేయలేదని, బెంగళూరు విడిచి వెళ్లలేదన్నారు. అనంతరం శనివారం మధ్యాహ్నం దాదాపు మూడున్నర గంటల సమయంలో సీసీబీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు.
పొంతన లేని సమాధానాలు
బెంగళూరు అదనపు కమిషనర్ అలోక్ కుమార్, డీసీపీ గిరీష్, ఏసీపీ వెంకటేష్ ప్రసన్న సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి విచారణ జరిగింది. పోలీసులు అడిగే ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పారని తెలుస్తోంది. పొంతన లేని సమాధానాలతో విసుగెత్తించారనే వాదనలు వినిపిస్తున్నాయి. తనకు, అంబిడెంట్ సంస్థకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారని తెలుస్తోంది. తనను చాలామంది కలుస్తుంటారని, ఇందులో భాగంగా అంబిడెంట్ ఎండీ ఫరీద్ కలిసి ఉంటారని చెప్పారని సమాచారం. తాజ్ వెస్ట్ఎండ్ హోటల్ గదిని కొన్నేళ్ల కిందటి నుంచి లీజుకు తీసుకున్నానని, తన వద్ద బంగారం లేదని చెప్పారని తెలుస్తోంది.
గాలి విచారణ
గాలి జనార్ధన్ రెడ్డిని ఇంకా విచారిస్తున్నట్లు రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీసులు తెలిపారు. ఆయన నాలుగున్నర గంటలకు విచారణకు హాజరయ్యారని, అతనిని విచారిస్తున్నామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, పోలీసులు అతనిని అర్ధరాత్రి వరకు విచారించారని తెలుస్తోంది.
అరెస్ట్ ఛాన్స్ లేదు
గాలి జనార్ధన్ రెడ్డిని ఇప్పుడే అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అలీఖాన్, ఫరీద్లకు ముందస్తు బెయిలు దక్కటంతో వీరిని విచారణ అనంతరం విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. శనివారం రాత్రి ఆయన ఇంటి నుంచి ఆహారం తెచ్చినా పోలీసులు అంగీకరించలేదు.
హాజరుకు ముందు గాలి కసరత్తు
బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావడానికి ముందు గాలి పెద్ద కసరత్తు చేశారని తెలుస్తోంది. తాను బెంగళూరులోనే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, ఈ నాలుగు రోజులూ కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని ఓ విడిదిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ సమయంలో ఆయన హైదరాబాదుకు కూడా వచ్చారని ప్రచారం సాగింది. నాలుగు రోజులుగా పోలీసులు తన నివాసాల్లో జరుపుతున్న సోదాలను, వారు మీడియాకు వెల్లడిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు, తన లాయర్లతో చర్చలు జరిపారు. గడువు కంటే ముందు హాజరైతే అరెస్ట్ అవకాశముండదని అతనికి కొంతమంది అధికారుల నుంచి హామీ వచ్చిందని, దీంతో విచారణకు వచ్చారనే ప్రచారం సాగుతోంది.