అయ్యప్ప స్వామి సన్నిధిలో శ్రీరాములుతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి
బెంగళూరు: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డి తన ఆప్తమిత్రులు, శాసన సభ్యులతో కలిసి కేరళలో శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. బళ్లారి పార్లమెంట్ సభ్యులు, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణస్నేహితుడు శ్రీరాములు, కంప్లి శాసన సభ్యుడు సురేష్ బాబుతో సహ 30 మంది అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు.
బెంగళూరులోని రవీంద్రనాథ్ ఠాగూర్ నగరలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం గాలి జనార్దన్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే సాయంత్రం వరకు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
సాయంత్రం ప్రత్యేక విమానంలో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు తదితరులు కేరళలోని కోచ్చికి వెళ్లారు. అక్కడి నుండి శబరిమలైలోని అయ్యప్పస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి మూడు సంవత్సరాల నాలుగు నెలలకు పైగా జైలులో ఉన్నారు.
గాలి జానార్దన్ రెడ్డికి బెయిల్ వస్తే తాను అయ్యప్ప మాల వేసుకుంటానని ఎంపి శ్రీరాములు దేవుడికి మొక్కుకున్నారు. జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. బెళేకెరె కేసులో శాసన సభ్యుడు సురేష్ బాబుకు బెయిల్ వచ్చింది.
గాలి జనార్దన్ రెడ్డి జైలులో ఉన్న సమయంలోనే శ్రీరాములు ఈ విషయం చెప్పారు. బెయిల్ మంజూరు అయిన తరువాత నేను నీతో పాటు అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తానని గాలి చెప్పారు. ఇప్పుడు అందరూ కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.
గత సంవత్సరం పార్లమెంట్ సభ్యుడు శ్రీరాములు అయ్యప్ప మాల వేసుకుని శబరిమలై వెళ్లిన సమయంలో మొక్కుకున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.