చైనా మొసలి కన్నీరు! భారత్ పై జపాన్ మాయ, ఎన్ని బుల్లెట్ ట్రైన్ లు వచ్చినా..
భారత్ సంక్షేమంపై చైనా పత్రికలకు ఒక్కసారిగా శ్రద్ధ పెరిగిపోయింది.. ఇండియా ఎక్కడ తప్పుదోవపడుతుందో అంటూ తెగ మథనపడిపోతున్నాయి. చైనా శత్రుదేశమైన జపాన్.. భారత్ను మాయ చేస్తోందంటూ మొసలి కన్నీరు కారు
న్యూఢిల్లీ: భారత్ సంక్షేమంపై చైనా పత్రికలకు ఒక్కసారిగా శ్రద్ధ పెరిగిపోయింది.. ఇండియా ఎక్కడ తప్పుదోవపడుతుందో అంటూ తెగ మథనపడిపోతున్నాయి. చైనా శత్రుదేశమైన జపాన్.. భారత్ను మాయ చేస్తోందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత శ్రేయస్సు కోరుతూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ఓ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా వెస్ట్నార్మల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ విభాగ డైరెక్టర్ జింగ్చున్ పేరుతో ఈ కథనం వెలువడింది.
అమెరికాతో కలిసి జపాన్ భారత్ను తప్పుదోవ పట్టిస్తోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ దేశాల మాటలు నమ్మి భారత్ ది బెల్ట్ అండ్ రోడ్ ఫోరం సదస్సును బహిష్కరించగా.. అమెరికా, జపాన్ ప్రతినిధులు మాత్రం హాజరయ్యారు అని తెలిపింది.
జపాన్ నేరుగా అమెరికాను ఎదుర్కోలేక భారత్ను పావులా వాడుకుంటోందని పేర్కొంది. మోడీ, అబేలు ప్రస్తావించిన ఆసియా-ఆఫ్రికా గ్రోత్ కారిడార్ కాన్సెప్ట్ చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తీసుకున్నదే అని తేల్చేసింది.
భారత్లో ఎన్ని ఎక్స్ప్రెస్వేలను, బుల్లెట్ ట్రైన్లను నిర్మించినా అక్కడి రహదారులు మురికి కూపాలను పోలి ఉంటాయని ఎద్దేవా చేసింది. జపాన్, భారత్లు వారి దేశాల అవసరాల ఆధారంగా సంబంధాలు మెరుగు పర్చుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని హితవు పలికింది.
జపాన్ ఎగుమతులు, టెక్నాలజీ, పెటుబడుల పరంగా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇక భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సహకారం సత్ఫలితాలను ఇస్తుందంటూ సలహా ఇచ్చింది.
ఇటీవల డోక్లామ్ కూడలి వద్ద భారత్ చైనా దళాలు మోహరించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ సమయంలో చైనా మీడియా భారత్ను భయపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ వివాదం ముగిశాక జపాన్ ప్రధాని షింజో అబె భారత్ వచ్చి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో చైనా ఉలిక్కిపడింది. అబే పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన చైనా.. భారత్, జపాన్ సంబంధాలపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోంది.