లాక్ చేసి, నెల రోజులు జపాన్ యువతి రేప్: నేషనల్ షేమ్ అన్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: జపాన్ మహిళ పైన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి ఓ చోట నెల రోజుల పాటు లాక్ చేసి, అత్యాచారం చేశారు. దీనిపై కేంద్ర పర్యాటక శాఖమంత్రి మహేష్ శర్మ స్పందించారు. ఇది జాతికి సిగ్గు చేటు అని, ఇది భారతదేశానికి మచ్చ తీసుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్కు వచ్చే విజిటర్స్కు హైల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తామన్నారు.
ఐదుగురు నిందితులు 22 ఏళ్ల జపాన్ యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె తప్పించుకుంది. వారు తన పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె చెప్పారు.
కాగా, జపాన్ యాత్రికురాలిని ఎత్తుకెళ్లి, ఆమెను దోచుకుని, ఆమపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో కోల్కతా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయలో నిరుడు నవంబర్లో జరిగింది.
ఈ నేరాలకి పాల్పడిన ముఠా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందింది. ఈ ముఠా జపాన్ యాత్రికులను మోసం చేయడం, శారీరకంగా దాడికి పాల్పడడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) పికె ఘోష్ చెప్పారు. కోల్కతాలోని జపాన్ కాన్సులేట్ మహిళపై జరిగిన నేరం గురించి ఫిర్యాదు చేసింది.
ఆ ఫిర్యాదు ప్రకారం - జపాన్ యాత్రికురాలిని నవంబర్ 23వ తేదీన ముఠా అపహరించి, సముద్ర తీరంలో ఉండే దిఘాకు తీసుకుని వెళ్లింది. ఆ తర్వాత నిందితులు ఎటిఎం కార్డు ద్వారా ఆమె ఖాతా నుంచి 76 వేల రూపాయలు డ్రా చేశారు. రెండు రోజుల తర్వాత ఆమెతో పాటు ముఠా సభ్యులు కోల్కతాకు వచ్చారు.
అదే కారులో వారు వెంటనే బుద్ధగయకు వెళ్లిపోయారు. మార్గమధ్యంలో ఇద్దరు ముఠా సభ్యులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను వారణాసికి చెందిన బస్సు ఎక్కించారు. అక్కడ ఆమె తన మిత్రులను కలుసుకుని జపాన్ కాన్సులేట్ను సంప్రదించింది.
డిసెంబర్ 26వ తేదీన జపాన్ కాన్సులేట్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె అత్యాచారానికి గురైందని చెబుతున్న నెల రోజుల తర్వాత ఈ ఫిర్యాదు వచ్చింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నిందితుల్లో ముగ్గురుని కోల్కతాలో పట్టుకోగలిగారు. మరో ఇద్దరిని బుద్ధగయలో పట్టుకున్నారు. ఇద్దరిపై అత్యాచారం అభియోగాలు మోపారు. మరో ముగ్గురిపై చీటింగ్, క్రిమినల్ కుట్ర, అహపరణ, ఇతర నేరాల కింద కేసులు పెట్టారు. మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.