జయలలిత క్షేమం ఉండాలి: అపోలోకు శరత్ కుమార్
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత క్షేమంగా ఉన్నట్లు ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ సోమవారం తెల్లవారుజామున తెలిపారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్య సేవలు అందించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి బయలుదేరిన నలుగురు డాక్టర్ల బృందం చెన్నై అపోలో ఆసుపత్రికి చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ బృంద0 వచ్చింది. వారు ఆసుపత్రికి చేరిన వెంటనే జయకు వైద్యం ప్రారంభించారు.
జయలలిత ఆరోగ్యం గురించి కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందని కేంద్రమంత్రి మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆమె చికిత్స కోసం ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపించామన్నారు.
జయలలితకు చికిత్సకు సంబంధించి పూర్తి సహాయసహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అపోలో ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, జయ త్వరగా కోలుకోవాలన్నారు.
కాగా, అంతకుముందు ఉదయం... నటుడు శరత్ కుమార్ మాట్లాడారు. జయలలిత క్షేమంగా ఉండాలని కోరుకకుంటున్నానని సోమవారం తెల్లవారుజామున తెలిపారు. ఆయన అపోలో ఆసుపత్రిలో అమ్మను చూసి వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
జయ ఆరోగ్యం క్లార్టీ లేదు: 'అపోలో' ట్వీట్ నుంచి.. ఎన్నో అనుమానాలు, ఆందోళన
జయలలిత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే 24 గంటల తర్వాత వైద్యులు వెల్లడిస్తామని చెప్పారని తెలిపారు.
మరో 12 గంటలు ఏం చెప్పలేం: డాక్టర్లు
జయలలితకు చికిత్స అందిస్తున్నామని, మరో 12 గంటలు ఏం చెప్పలేమని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమెకు హార్ట్ అసిస్ట్ పరికరంతో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.
ఆసుపత్రి వద్ద టెన్షన్
అపోలో ఆసుపత్రికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. లక్షల్లో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. జయ త్వరగా కోలుకోవాలంటూ ఆసుపత్రి బయట ప్రార్థనలు చేస్తున్నారు.
మరికొందరు జయ ఫొటోలను ప్రదర్శిస్తూ లాంగ్ లివ్ అమ్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కొందరు అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆస్పత్రిలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. తొక్కిసలాట జరగడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆసుపత్రి లోపల, బయట భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు లాఠీచార్జీ చేశారు.
మాట మాట్లాడని గవర్నర్, ఆర్మీ-పోలీస్ మోహరింపు: 24 గం.తర్వాతే అమ్మ ఆరోగ్యంపై..
కాగా, జయ ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముంబైలో ఉన్న గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటీన చెన్నై చేరుకున్నారు.
జయకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, డీజీపీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకున్నారు.
అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. ఆసుపత్రి వర్గాలు రాత్రి 9.15కు ప్రకటన విడుదల చేయడంతో మహిళా కార్యకర్తలు ఒక్కసారిగా విలపించారు. భారీ ఎత్తున తరలివస్తున్న కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఆస్పత్రికి వెళ్లే ప్రధాన రహదారిని మూసేశారు. ఆస్పత్రి పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. పోలీసు సిబ్బంది అందరూ వారి వారి స్టేషన్లకు సోమవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
జయలలిత పరిస్థితి విషమంగా ఉందని, వివిధ విభాగాల వైద్య నిపుణుల బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అపోలో ఆసుపత్రి జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. జయ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా అపోలో ఆస్పత్రి ప్రజలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.