15రోజుల్లోగా అమ్మ డిశ్చార్జి : పూర్తి స్థాయిలో కోలుకుంటున్న జయ
చెన్నై : రేపో మాపో డిశ్చార్జి ఖాయమంటూ గత కొద్దిరోజులుగా జయలలిత గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలకు తెరదించుతూ మరో 15రోజుల్లోగా ఆమె డిశ్చార్జి ఖాయమంటూ ప్రకటించారు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి.పొన్నియన్.
ఇప్పటికే జయలలిత పూర్తి స్థాయిలో కోలుకున్నప్పటికీ.. కోలుకున్న వెంటనే బయటి వాతావరణంలోకి వెళితే.. ఇన్ ఫెక్షన్లు సోకే ప్రమాదమున్నందునా.. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండడమే మేలు అని అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జయలలిత ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని, అన్ని అవయవాలు సక్రమంగానే పనిచేస్తున్నాయని తెలియజేశారు.
కృత్రిమ శ్వాస పరికరాలను తొలగించని వెంటనే..తనంతట తానుగా కూర్చోవడం జయలలిత కాస్త కష్టంగా మారిందని పొన్నియన్ వెల్లడించారు. ఘన-ద్రవ పదార్థాలను జయలలిత తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం జయలలిత చికిత్స పొందుతోన్న క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు) లోకి వైద్యులు, ఫిజియో థెరపిస్టులు, నర్సులను తప్ప ఇంకెవరిని లోపలికి అనుమతించడం లేదు.
సిసియు నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ఆడియో వ్యవస్థ ద్వారా ఆమె తన ప్రధాన కార్యదర్శి, సలహాదారులతో మాట్లాడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇకపోతే గత సెప్టెంబర్ 22న తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ తో జయలలిత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచి, అంటే.. దాదాపు 48రోజులుగా ఆమె ఆసుపత్రికే పరిమితమయ్యారు. దీంతో ఆమె డిశ్చార్జి కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.