ఆంధ్రాలో జయలలిత కారు సీజ్: ఆత్మకు భయపడి వదిలేశారా!
చిత్తూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఉపయోగించిన పాత కారును ఆంధ్రపద్రేశ్ లోని చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్జనప్రదేశంలో ఆ కారును గుర్తు తెలియన వ్యక్తులు వదిలి వెళ్లారని పోలీసు అధికారులు అంటున్నారు.
చిత్తూరు జిల్లాలోని కేవీబీ పురం మండలంలోని ఆరోం గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో కారు నిలిపి ఉన్న విషయం స్థానికులు గుర్తించారు. అయితే తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఆ కారు అక్కడి నుంచి ఎంత వరకు కదలకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానిక సబ్ ఇన్స్ పెక్టర్ పరుశురాముడు సంఘటనా స్థలానికి చేరుకుని కారులోని పత్రాలు పరిశీలించారు. టీఎన్ 07-వీ 1948 నెంబరు ఉన్న కారు మొదట జయలలిత పేరుతో రిజిస్టర్ అయ్యిందని ఎస్ఐ పరుశురాముడు గుర్తించారు.

జయలలిత తరువాత ఆ కారును వేరే వ్యక్తికి విక్రయించారని, ఆయన మరో వ్యక్తికి ఆ కారును విక్రయించారని పత్రాలలో వెలుగు చూసిందని ఎస్ఐ పరుశురాముడు చెప్పారు. అయితే ఆ కారు యజమాని ఎందుకు ఇక్కడ వాహనం వదిలిపెట్టి వెళ్లారో అర్థం కావడం లేదని, విచారణ చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఈ విషయంపై ఆంధ్రపద్రేశ్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. జయలలిత ఆత్మకు భయపడి ఆ కారు అక్కడ వదిలిపెట్టి వెళ్లి ఉంటారని కేవీబీ పురం మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కారు యజమాని చిరునామా తెలుసుకున్న పోలీసులు ఆయనను విచారించడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications