జయలలిత వీరాభిమాని: తలకిందులుగా 2 కిమీ నడక
కోయంబత్తూర్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమ నేత నిర్దోషిగా విడుదల కావడంతో తమిళనాడులో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మ భక్తిని ప్రదర్శించుకోవడానికి వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన జయ అభిమాని ఛత్రపతి తలకిందులుగా రెండు కిలోమీటర్లు నడిచి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
యాభై ఏళ్ల యోగా నిపుణుడు ఛత్రపతి మంగళవారంనాడు తలకిందులుగా చేతులపై రెండు కిలోమీటర్ల మేర నడిచాడు. ట్రాఫిక్ను కూడా లెక్క చేయకుండా అతను రేస్ కోర్సు రోడ్డు సమీపంలో చేతులపై నడవడం కనిపించింది. పాలనాదక్షత, నైపుణ్యాల కారణంగా తాను జయలలిత అభిమానిగా మారినట్లు ఆయన ప్రజలకు చెబుతూ తన యాత్రను సాగించాడు.

ఛత్రపతి నగరంలోనూ, పరిసరాల్లోనూ దాదాపు రెండు కిలోమీటర్లు చేతుల మీద నడిచాడు. ఆ విధంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
జయలలిత ఈ నెల 23వ తేదీన తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన ఆమె పార్టీ శాసనసభ్యులను కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications