'ఏ అర్హతతో జయపై ఇలా.. ప్రజా జీవితమే.. కానీ బహిర్గతమంటే ఎలా?
ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అయినంత మాత్రానా జయకు జరిగిన చికిత్సను బయటకు వెల్లడించాలా? అని కోర్టు ప్రశ్నించింది.
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ కన్నుమూసిన జయలలిత మృతిపై ఇంకా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయలలిత మృతిపై దర్యాప్తు చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దీనిపై కోర్టు విచారణ జరుపుతోంది.
తాజా విచారణలో హైకోర్టు పిల్ పై పలు అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అయినంత మాత్రానా జయకు జరిగిన చికిత్సను బయటకు వెల్లడించాలా? అని కోర్టు ప్రశ్నించింది. జయకు జరిగిన చికిత్సపై ప్రత్యేక అనుమానాలేమైనా ఉన్నాయా? అంటూ ప్రశ్నించిన కోర్టు.. ఏ అర్హతతో వివరాలు కోరుతున్నారని నిలదీసింది.
పిల్ దాఖలు చేసినవారిలో జయ కుటుంబానికి సంబంధించిన వారెవరూ లేకపోవడంతో.. చికిత్స వివరాలను వెల్లడించడం సంక్లిష్టంగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉందని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషనకౌల్, న్యాయమూర్తి ఎం.సుందర్లతో కూడిన ప్రథమధర్మాసనం ఈవిధంగా వ్యాఖ్యానించింది.
కాగా, జయ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ అరుంబాక్కానికి చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడు జోసెఫ్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ సెలవుల సందర్బంలో తొలుత ఈ పిల్ విచారణకు వచ్చింది. ఆ సందర్బంలో విచారణను జనవరి 9కి వాయిదా వేసింది కోర్టు. తదనుగుణంగా సోమవారం నాడు జరిపిన విచారణలో కోర్టు పైవిధంగా స్పందించింది.
ఇదిలా ఉంటే, నాగపట్టణం జిల్లా సెమ్మనార్కోవిల్కు చెందిన అన్నాడీఎంకే ప్రముఖ నేత జ్ఞానశేఖరన కూడా జయ మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే తరహాలో ట్రాఫిక్ రామస్వామి కూడా జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం నాడు మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్లని విచారించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఇదే తరుణంలో జయకు 75 రోజులపాటు అందించిన చికిత్సల వివరాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అపోలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
మరోవైపు అన్నాడీఎంకె బహిష్కృత నేత శశికళ పుష్ప.. జయ మృతిపై విచారణ జరిపించాలని హోంమంత్రి రాజ్ నాథ్ ను కోరిన నేపథ్యంలో.. కేంద్రం నుంచి సీబీఐకి ఉత్తర్వులు జారీ అయ్యే సూచనలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.