అవును! జయలలితే వద్దన్నారు: ఆస్పత్రి ఫొటోలపై అపోలో వివరణ
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరిక మేరకే ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటి ఆమె ఫొటోలను విడుదల చేయలేదని మద్రాసు హైకోర్టుకు అపోలో ఆస్పత్రి తెలిపింది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరిక మేరకే ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటి ఆమె ఫొటోలను విడుదల చేయలేదని మద్రాసు హైకోర్టుకు అపోలో ఆస్పత్రి తెలిపింది. జయ మృతిపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలంటూ స్థానిక అరుంబాక్కంకు చెందిన అన్నాడీఎంకే నేత జోసెఫ్ దాఖలు చేసిన పిటిషన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కులువాడి రమేశ, జస్టిస్ మహదేవనల ధర్మాసనం ఎదుట గురువారం ఉదయం విచారణకు వచ్చింది.
అపోలో ఆస్పత్రి కౌంటర్
ఈ సందర్భంగా అపోలో ఆస్పత్రి నిర్వాహకులు కౌంటర్ అఫిడవిట్ను సమర్పించారు. అపోలో ఆస్పత్రి తరఫున సీనియర్ న్యాయవాది పీఎస్ రమణ వాదిస్తూ.. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఊహాగానాల ఆధారంగా తమ ఆస్పత్రిని శంకిస్తూ పిటిషనర్ కేసు వేసినట్లు అనిపిస్తోందన్నారు.
జయ అనుమతి ఇవ్వనందునే..
అంతేగాక, తమ ఆస్పత్రిపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదని, భారతీయ వైద్యమండలి విధివిధానాల ప్రకారం రోగి చికిత్స వివరాలను వెల్లడించరాదని, జయ ఆస్పత్రిలో చికిత్స పొందినప్పుడు ఆమె అనుమతితోనే ప్రకటనలు జారీ చేశారని పేర్కొన్నారు. ప్రజల అనుమానాలు తొలగించేలా జయ ఫొటో తీసి విడుదల చేయాలని ఆస్పత్రి యాజమాన్యం భావించినా.. ఆమె అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించామని వివరించారు.
నివేదికకూ సిద్ధమే..
జయ చికిత్సల వివరాలను ఓ నివేదికగా రూపొందించి సమర్పించేందుకు కూడా ఆస్పత్రి యాజమాన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. రెండు వారాల గడువిస్తూ తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం మార్చి 13కి వాయిదా వేసింది.
జయ మరణంపై అనుమానాలు..
జయలలిత మరణం అనంతరం పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పటి ఫొటోలను కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఆస్పత్రి ఇచ్చిన వివరణతో ఈ విషయంపై కొంత స్పష్టత వచ్చినట్లయింది.