జయ కోహినూరు వజ్రం: ఆమె ఓటమికి నేనే కారణం: రజనీ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఓ వజ్రం లాంటి వారని, మరణానంతరం ఆమె కోహినూరు వజ్రంగా మారారని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఓ వజ్రం లాంటి వారని, మరణానంతరం ఆమె కోహినూరు వజ్రంగా మారారని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రెండేళ్ల వయస్సులో తండ్రిని, 22 ఏళ్ల వయస్సులో తల్లిని పోగొట్టుకున్నా, అనారోగ్యాన్ని సైతం లెక్క చెయ్యకుండా ఆమె ప్రజల కోసం పని చేశారాని గుర్తు చేశారు.
దక్షిణ భారత భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఆధ్వర్యంలో జయలలిత, తుగ్లక్ పత్రిక సంపాదకులు చో రామస్వామికి నివాళిలర్పించే కార్యక్రమం చెన్నైలో జరిగింది. రజినీకాంత్ కు చెందిన రాఘవేంద్ర కల్యాణమండపం ఈ కార్యక్రమానికి వేదిక కావడం విశేషం.
ఈ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ జయలలిత, చో రామస్వామికి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా రజనీ మాట్లాడుతూ జయలలిత 1996లో ఓడిపోవడానికి తాను ఓ కారణం అయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ సమయంలో జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేశానని, ఆమెను అధికారం నుంచి దింపేందుకు తాను కారణం అయ్యానని రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ వ్యాఖ్యానించారు. ఆ తరువాత తన కుమార్తె పెళ్లి పత్రిక జయలలితకు ఇచ్చానని అన్నారు.
ఆ పెళ్లికి జయలలిత రారని తాను భావించానని, అదే రోజు అన్నాడీఎంకే కీలక నేత వివాహం ఉన్నప్పటికి జయలలిత వచ్చి తన కుమార్తెకు ఆశీర్వచనాలు అందజేశారని ఇదే సమయంలో గుర్తు చేసుకున్నారు.
ఎన్ని సమస్యలు ఎదురైనా జయలలిత లెక్కచెయ్యలేదని, ఆమె ఆ సమస్యలను గెలుపు గుర్రాలుగా మార్చుకున్న ధీర వనిత అన్నారు. జయలలిత లాంటి ధీర వనితలా ఇంకెవరినీ చూడలేమని రజనీకాంత్ చెప్పారు. ఇదే సమయంలో అనేక మంది సినీ ప్రముఖులు జయలలిత, చో రామస్వామికి నివాళిలర్పించారు.