జయలలిత వారసురాలు శశికళనే.. ఇవిగో ఆధారాలు!
చెన్నై: అన్నాడీఎంకే తదుపరి చీఫ్ శశికళనే అని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు శుక్రవారం నాడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అంటున్నారు.
జయలలిత మృతి: మరో షాకింగ్ కొత్త కోణం!
శశికళను తన రాజకీయ వారసురాలిగా జయలలిత పేర్కొందని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అన్నాడఎంకే పగ్గాలు శశికళకు ఎందుకు అప్పగించాలని, ఆమెకు ఏం సంబంధమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధి పొన్నియాన్ ఇందుకు సంబంధించిన ఆధారాలు అంటూ శుక్రవారం వెల్లడించారు.
1991 పత్రాలు ఆధారంగా చూపిన అన్నాడీఎంకే
1991లోని పత్రాలను ఆయన ఆధారాలుగా చూపించారు. ఆ సమయంలో జయలలిత తన వారసురాలిగా శశికళను పేర్కొన్నదని, ఇందుకు సంబంధించి పత్రాల్లో ఉందని వాటిని చూపించారు.
తన ఆస్తుల వారసురాలిగా శశికళను జయలలిత చూపించారని పేర్కొన్నారు. 1991లో ఓ చిట్ ఫండ్ కంపెనీలో తన నామినీగా శశికళను చూపించారని చెప్పారు.
శశికళనే వారసురాలు
దీనిని బట్టే జయలలిత వారసురాలు ఎవరో తెలుసుకోవచ్చునని, అర్థమవుతోందని చెబుతున్నారు. అమ్మ వారసురాలు శశికళనే అని ఈ ఆధారాలతో తేటతెల్లమవుతుందని అంటున్నారు.
ఇరవై అయిదేళ్ల క్రితమే చెప్పారు
1991లో అమ్మ జయలలిత.. శశికళను తన నామినీగా పేర్కొన్నారని, కాబట్టి రాజకీయ వారసురాలు కూడా శశికళే అవుతుందని చెప్పారు. ఆమె పార్టీ అధ్యక్షురాలు కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని మీడియా సమావేశంలో చెప్పారు.
ప్రశ్నించిన మరుసటి రోజే
కాగా, మద్రాసు హైకోర్టులో పార్టీ నుంచి సస్పెండైన ఎంపీ శశికళ పుష్ప పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే చీఫ్గా శశికళ బాధ్యతలు చేపట్టకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ దాఖలు చేసిన మరుసటి రోజే (ఈ రోజు శుక్రవారం) అన్నాడీఎంకే స్పందించడం గమనార్హం.
పార్టీ మెంబర్గా కూడా..
జయలలిత వారసురాలిగా శశికళ ఎందుకో చెప్పాలని శశికళ పుష్ప ప్రశ్నించారు. ఆమె 2011 తర్వాత వరుసగా ఐదేళ్ల పాటు పార్టీ సభ్యురాలిగా లేరని, అలాంటప్పుడు ఆమెకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. అంతకుముందు పార్టీ నుంచి బహిష్కరింపడిన ఆమె, ఆ తర్వాత 2011లో తిరిగి వచ్చారన్నారు.
శశికళ కోసం కసరత్తు
మరోవైపు, పార్టీ అధికార ప్రతినిధి పొన్నియాన్ గురువారం మాట్లాడుతూ.. శశికళను పార్టీ అధినేత్రిగా చేసేందుకు అందరు సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోందన్నారు.