జయను పరామర్శించిన రజినీ: సింగపూర్ వైద్యుల చికిత్స
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పరామర్శించారు. ఆదివారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత వద్దకు కుమార్తె సౌందర్యతో కలిసి వెళ్లిన రజినీకాంత్ పరామర్శించారు.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పన్నీర్సెల్వం, ఇతర మంత్రులు, వైద్య బృందంతో మాట్లాడి జయలలిత ఆరోగ్య పరిస్థితిని రజనీకాంత్ తెలుసుకున్నారు. జయలలితకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో పెద్దఎత్తున పూజలు, యాగాలు, హోమాలు నిర్వహించారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను పరామర్శించనున్నారని, ఇంకా తేదీ ఖరారు కాలేదని కేంద్ర నౌకాయాన సహాయమంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. జయలలితను పరామర్శించేందుకు త్వరలోనే ఆయన చెన్నై వస్తారని ఆయన తెలిపారు.
அன்புள்ள CM அவர்கள் விரைவில் நலமடைய இறைவனை பிராத்திக்கிறேன்
— Rajinikanth (@superstarrajini) 24 September 2016
🙏🏻 wishing you a speedy recovery respected CM madam https://t.co/9WuNuVDrlP
— soundarya rajnikanth (@soundaryaarajni) 24 September 2016
సింగపూర్ వైద్యులతో చికిత్స
జయలలితకు చికిత్స అందించేందుకు సింగపూర్కు చెందిన ఇద్దరు మహిళా వైద్యులు ఆదివారం చెన్నైకి వచ్చారు. దాదాపు 25 రోజులుగా అపోలో ఆస్పత్రిలోనే జయ వైద్య సేవలు పొందుతున్నారు. ఆమెకు డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్ వైద్యులు ఖిల్నానీ, నితీష్ నాయక్లతోపాటు అనస్తీషియా నిపుణుడు అంజన్ ట్రిక్కాలు ఆదివారం చికిత్స చేశారు.
జయలలితను సింగపూర్కు తీసుకెళ్లనున్నట్లు కూడా ఒకదశలో వార్తలు వచ్చాయి. అయితే, సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి చెందిన ఇద్దరు ఫిజియోథెరపీ మహిళా వైద్యులు ఆదివారం చెన్నైకి వచ్చారు. ప్రస్తుతం జయలలితకు అందిస్తున్న వైద్యంపై అధ్యయనం చేసి.. ఆ తర్వాత రిచర్డ్ సూచనల మేరకు వీరు సేవలు అందజేయనున్నట్లు సమాచారం.