తమిళనాడు సిఎంగా జయలలిత ప్రమాణం: రజనీకాంత్ హాజరు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడియంకె అధినేత జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత గవర్నర్ కె. రోశయ్య శనివారంనాడు ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు 29 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేయడానికి అన్నాడియంకె అధినేత జయలలిత మద్రాసు విశ్వవిద్యాలయం సెంటినరీ ఆడిటోరియం చేరుకున్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ నటుడు శరత్ కుమార్ ఐసిసి చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ తదితరులు హాజరయ్యారు. ఆమె నివాసం నుంచి బయలుదేరి వస్తున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.

బిజెపి జాతీయ కార్యదర్శి హెచ్. రాజా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది ఐదో సారి. జయలలిత మద్దతుదారులు పెద్ద యెత్తున ఆడిటోరియం వెలుపల గుమిగూడారు. జయ అభిమానులు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ కనిపించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్ రోశయ్య ఆమెకు పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఆమె అభిమానులు శనివారం ఉదయంనుంచే రోడ్లపై సందడిచేశారు. చెన్నై రహదారులన్నీ జయ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ప్రమాణస్వీకారానికి పదిహేను నిమిషాలముందు జయలలిత తమ ఇంటినుంచి బయలుదేరారు. కొందరు ఆమెపై పూలవర్షం కురిపించారు. అభిమానులకు నమస్కారం చేస్తూ జయ చిరునవ్వుతో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు.













Click it and Unblock the Notifications