కుప్పకూలిన జయలలిత: సుప్రీం కోర్టులో అప్పీల్
బెంగళూర్: కర్ణాటక హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో కోర్టులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఆమెకు జైలులో వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. కర్ణాటక హైకోర్టు బెయిల్ను తిరస్కరించడంతో ఆమె హతాశురాలైనట్లు చెబుతున్నారు. కోర్టు నిర్ణయాన్ని ఆమె టీవీలో చూశారు.
కాగా, జయలలిత బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. జయలలితకు బెయిల్ రాకపోవడంపై తానమే ఆశ్చర్యపోవడం లేదని, ఇలాగే జరుగుతుందని తాను అనుకున్నానని జయలలిత మీద కేసు పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనే...
జయలలితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అవినీతి అంటే మానవ హక్కుల ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. జయలలిత బెయిల్ పిటిషన్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరం చెప్పనప్పటికీ బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది.
జయలలిత శిక్షను నిలిపివేయడానికి కూడా ఏ విధమైన ఆధారం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అవినీతి కేసులను కఠినంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టు గుర్తు చేసింది.