'డిప్యూటీ సీఎం' ఇద్దరా? ఒక్కరా?: కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఎడతెగని చర్చ!
న్యూఢిల్లీ/బెంగళూరు: కొత్తగా ఏర్పడబోయే కర్ణాటక ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు చోటు కల్పించడంపై కాంగ్రెస్, జేడీఎస్ లు ఇంకా ఓ అవగాహనకు రానట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో చర్చించిన కుమారస్వామి.. డిప్యూటీ సీఎం పోస్టు ఇద్దరికి ఇవ్వడానికి తిరస్కరిస్తున్నట్టు సమాచారం.
కర్ణాటక ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు: ఒకరు పరమేశ్వర, మరొకరు?
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఒకరినే నియమించాలా?.. లేక ఇద్దరిని నియమించాలా? అన్నదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. కేబినెట్ లోని 34 బెర్తుల్లో 20 కాంగ్రెస్ కి ఇవ్వడానికి అంగీకరించిన జేడీఎస్.. స్పీకర్ పదవి కూడా వారికే ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే డిప్యూటీ సీఎం పదవి విషయంలో మాత్రం.. ఆ పోస్టులో ఒక్కరినే కూర్చోబెడితే బాగుంటుందని కుమారస్వామి అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు దీనిపై 'వన్ఇండియా.కామ్'కి సమాచారం అందించాయి.
కాగా, సీఎంగా కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారమే ఆ తంతు పూర్తవాల్సి ఉన్నా.. రాజీవ్ గాంధీ వర్థంతి కారణంగా వాయిదా పడింది. సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపించడం కోసం ఇరు పార్టీల మధ్య ఇప్పటికే ఓ కమిటీని కూడా వేశారు.
డిప్యూటీ సీఎం పదవిపై ఇప్పుడు కమిటీ నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ మాత్రం దళితుడు, కేపీసీసీ చీఫ్ అయిన పరమేశ్వరతో పాటు, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన శివశంకరప్పకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తొలుత ప్రతిపాదించింది. కానీ నిన్న కుమారస్వామి భేటీ సందర్భంగా.. డీకె శివకుమార్ పేరును డిప్యూటీ సీఎం పదవికి కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు సమాచారం.
బీజేపీ ప్రలోభాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన డీకెని కీలక స్థానంలో కూర్చోబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకెకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కుమారస్వామితో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికైతే ఈ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం.