జేఈఈ మెయిన్ 2021 షెడ్యూల్ విడుదల: నేటి నుంచి దరఖాస్తులు, పరీక్ష విధానంలో మార్పులివే
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ 2021 షెడ్యూల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ పరీక్షలు నాలుగు సార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Recommended Video
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. తొలిసారి పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహించనుండగా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడుసార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి సెషన్లలో పరీక్షలు జరిగే తేదీలను తర్వాత తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు.
జేఈఈ మెయిన్ కోసం నేటి (డిసెంబర్ 16) నుంచి జనవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అప్లికేషన్ ఫాంల కోసం https://jeemain.nta.nic.in/ ను సంప్రదించాలని కేంద్రమంత్రి తెలిపారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, కన్నడ, మరాఠీ, పంజాబీ, తమిళ్, ఉర్దూ, ఒడియా, మలయాళం.. ఇలా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుందని రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. అలాగే ఈసారి పరీక్ష విధానంలో కూడా మార్పులు చేశారు.
90 ప్రశ్నలకు గానూ 75 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ మాథ్స్ విభాగాల్లో 30 ప్రశ్నలకు గానూ 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఎవరైనా విద్యార్థి నాలుగుసార్లూ పరీక్షలకు హాజరైతే ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.