అక్రమ నిర్మాణం: జీసస్ విగ్రహం.. శిలువ తొలగింపుపై దుమారం
బెంగళూరు: ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఏసుక్రీస్తు విగ్రహం, కొన్ని శిలువలను స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించిన ఉదంతం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. జీసస్ విగ్రహాన్ని తొలగించడానికి స్థానిక క్రైస్తవులు అడ్డుపడినప్పటికీ.. అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. విగ్రహం, శిలువలను ధ్వంసం చేశారు. శిథిలాలను ట్రక్కులో తరించారు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దేవనహళ్లిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కొందరు క్రైస్తవ మత పెద్దలు.. అక్కడ జీసస్ విగ్రహాన్ని, శిలువను నిర్మించారంటూ స్థానిక భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ కార్యకర్తల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, క్రైస్తవ మాతాన్ని విస్తరించడానికి చేస్తోన్న ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలు కిందటి నెల 23వ తేదీన సంబంధిత స్థలంలో నిరసనలు చేపట్టారు.

దీనిపై అధికారులు ఆరా తీశారు. సర్వే నంబర్లు, భూ రికార్డులను పరిశీలించారు. దీనితో ఏసుక్రీస్తు విగ్రహ నిర్మాణం అక్రమమైదని నిర్ధారించారు. దాన్ని తొలగించడానికి సన్నాహాలు చేశారు. ఈ విషయం తెలియడంతో దేవనహళ్లిలో నివసించే పలువురు క్రైస్తవులు అధికారుల చర్యలకు అడ్డుపడటానికి ప్రయత్నించారు. పోలీసుల సహాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి రాకుండా అడ్డుకున్నారు. అనంతరం జీసస్ విగ్రహాన్ని, శిలువలను నేలమట్టం చేశారు. శిథిలాలను ట్రక్కులతో తరలించారు.
Recommended Video

దీనితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు ఎలాంటి నోటీసులను కూడా ఇవ్వకుండా విగ్రహాన్ని తొలగించారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్మశాన వాటిక కోసం క్రైస్తవ సంఘాలకు కేటాయించిన 4.20 ఎకరాల స్థలంలోనే తాము విగ్రహాన్ని నిర్మించామని చెబుతున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా చూస్తే.. ప్రభుత్వం కేటాయించిన స్థలం కంటే అధికంగా, పక్కనే ఉన్న పొరంబోకు స్థలాన్ని వారు ఆక్రమించారనేది అధికారుల వాదన. రికార్డుల్లో ఉన్న ప్రకారమే తాము జీసస్ విగ్రహాన్ని తొలగించామని వివరణ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications