జెట్ ఎయిర్వేస్లో వరుస వికెట్లు: గంటల వ్యవధిలో సీఎఫ్ఓ, సీఈఓ గుడ్బై!
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల నష్టాలతో రెక్కలు తెగిన జెట్ ఎయిర్వేస్ విమానయాన సంస్థలో మంగళవారం వరుస వికెట్లు పడ్డాయి. గంటల వ్యవధిలో ఆ సంస్థ ఉన్నతాధికారులు రాజీనామా చేశారు. ముఖ్య ఆర్థిక వ్యవహారాల అధికారి, డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వాల్ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే జెట్ ఎయిర్వేస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్ దుబే కూడా గుడ్బై చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము రాజీనామా చేస్తున్నట్లు వారిద్దరూ ప్రకటించారు.
తీవ్ర ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ తన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ వారు ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారు. వారి ఆందోళనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే రాజీనామాల పర్వం చోటు చేసుకుంది. తొలుత ఈ ఉదయం సీఎఫ్ఓ, డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వాల్ రాజీనామా చేశారు. సాయంత్రానికి సీఈఓ వినయ్ దూబే కూడా పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
సుమారు 8,500 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది జెట్ ఎయిర్వేస్. ఆ గండం నుంచి ఆ సంస్థను ఒడ్డున పడేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏ బ్యాంకు గానీ, ఇతర ఆర్థిక సంస్థలేవీ గానీ రుణాలను ఇవ్వడానికి సాహసించలేదు. దాని ప్రభావం సంస్థ కార్యకాపాలపై పడింది. నష్టాలను నుంచి తేరుకోలేక కునారిల్లిపోయింది. విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసింది.
నెల రోజులుగా పలువురు బోర్డు సభ్యులు పదవుల నుంచి తప్పుకొంటూ వస్తున్నారు. మొదట గౌరంగ్ షెట్టి, ఆ తరువాత సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్,ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డు నుంచి బయటికొచ్చారు. ఈ క్రమంలో- 245 కోట్ల రూపాయల విలువ చేసే జెట్ సంస్థ ఆస్తులను హెచ్డీఎఫ్సీ బ్యాంకు అమ్మకానికి పెట్టింది. ఆ బ్యాంకు నుంచి జెట్ ఎయిర్ వేస్ 414 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది.