జార్ఖండ్ సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య, పిల్లలతో పాటు 15 మందికి పాజిటివ్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1.60 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మొత్తం 15 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. వారందరికి హోం ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు.
సీఎంహెమంత్ సోరెన్ ఇంట్లో 15 మందికి పాజిటివ్..
జార్ఖండ్ ముఖ్క్ష్యమంత్రి హెమంత్ సోరెన్ నివాసంలో మొత్తం 62 మందికి కరోనా పరీక్షల నిర్వహించినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వారిలో 24 మందికి సంబంధించిన రిపోర్టులు శనివారం వచ్చాయి. పరీక్షల్లో 15 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. సీఎం హేమంత్ సోరెన్ కు మాత్రం నెగెటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో సీఎం సతీమణి కల్పనా సోరెన్, కుమారులు నితిన్ , విశ్వజీత్ , హేమంత్ సోరేన్ వదిన సరళ ముుర్ము, ఓ సెక్యూర్టీ గార్డుతో సహా మొత్తం 15 మంది కరోనా బారినపడ్డారని వినోద్ కుమార్ చెప్పారు. వీరికి స్వల్ప లక్షణాలే ఉండడంతో వారికి హోం ఐసోలేషన్లోనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి బన్నాగుప్తాకు పాజిటివ్
మరోవైపు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాకు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైట్లోకి వెళ్లారు. కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా మంత్రి వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మంత్రి బన్నా గుప్తా గతంలో కూడా కరోనా బారిన పడ్డారు.
జార్ఖండ్లో పెరిగిన కేసులు
జార్ఖండ్లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 5,081 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,74,000లకు చేరింది. యాక్టివ్ కేసులు 21,098 కి చేరాయి. నిన్న 1186 మంది కరోనా నుంచి కోలుకున్నారు.