ఖైదీ హత్య: 15 మందికి మరణశిక్ష విధించిన కోర్టు
రాంఛీ: ఓ ఖైదీని హత్య చేసిన కేసులో జార్ఖండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని జంషెడ్పూర్లో ఓ ఖైదీని హత్య చేసిన కేసులో 15 మంది దోషులకు ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురు దోషులకు ఏడుగురికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలురించింది.
వివరాల్లోకి వెళితే. ఘాఘీడీహ్ సెంట్రల్ జైలులో 2019లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ఖైదీలు తీవ్రగాయాల పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. మనోజ్ కుమార్ సింగ్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఈ కేసులో ఈస్ట్ సింగ్భుమ్లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి రాజేందర్ కుమార్ సిన్హా గురువారం ఈ కీలక తీర్పునిచ్చారు. కాగా, ఐపీసీ సెక్షన్లు 302(హత్య), 120బీ(నేరపూరిత కుట్ర) కింద 15 మందికి న్యాయమూర్తి ఉరి శిక్ష విధించారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
సెక్షన్ 307(హత్యాయత్నం) అభియోగాల కింద మరో ఏడుగురికి పదేళ్లపాటు జైలు శిక్షను విధించారు. అయితే, మరణశిక్ష పడినవారిలో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న ఇద్దరు ఖైదీలను పట్టుకుని తమ ఎదుట హాజరుపర్చాలని కోర్టు డీజీపీని ఆదేశించింది. ఆ దోషుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. 2019 జూన్ 25న సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. మనోజ్ కుమార్ సింగ్ తోపాటు ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి తరలిస్తుండగా మనోజ్ కుమార్ సింగ్ మరణించాడు.












Click it and Unblock the Notifications