జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుందా..? సర్వేలు ఏమి చెబుతున్నాయి
జార్ఖండ్ : మహారాష్ట్రలో నెలకొన్న మహా రాజకీయ పంచాయతీకి తెరపడింది. నెల రోజుల పాటు సాగిన హైడ్రామా మంగళవారంతో తెరపడింది. ఇక దృష్టంతా రానున్న జార్ఖండ్ ఎన్నికలపైనే ఉంది. ఇప్పటికే బీజేపీ ఒక రాష్ట్రం చేజార్చుకోగా... ఇక జార్ఖండ్లో ఎలాగైనా గెలిచి ఆ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. అయితే అది అంత ఈజీగా అయితే ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కో పార్టీ బీజేపీకి షాక్ ఇస్తుండటంతో మహారాష్ట్రలాంటి ఫలితాలే ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జార్ఖండ్లో పరిస్థితిపై ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?

బీజేపీ-జేఎంఎం కూటమిల మధ్య పోటీ
ఇన్ని రోజులు దేశం దృష్టంతా మహారాష్ట్ర రాజకీయాలపై ఉండగా ఆ సంక్షోభానికి తెరపడటంతో ఇక కాన్స్న్ట్రేషన్ జార్ఖండ్ ఎన్నికలపై మరలింది. జార్ఖండ్లో ఐయాన్స్ సీఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిల మధ్య పోటీ చాలా గట్టిగా ఉండనున్నట్లు ఐయాన్స్ - సీఓటర్ సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది.

బీజేపీకి అత్యధిక శాతం ఓటుషేరు
ఇక ఎన్నికల్లో బీజేపీకి 33.3శాతం ఓటు షేరు వస్తుందని ఐయాన్స్-సీఓటర్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇక కూటమి చూస్తే జేఎంఎంకు 18.8 శాతం, కాంగ్రెస్కు 12.4శాతం, ఆర్జేడీకి 23.2 శాతం ఓటు షేరు లభిస్తుందని సర్వే జోస్యం చెప్పింది. అయితే మొత్తంగా చూస్తే కూటమికి 31.2శాతం ఓటు షేరు లభించే అవకాశం ఉంది. దీంతో బీజేపీకి కూటమికి క్లోజ్ ఫైట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014లో జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) జేఎంఎం కాంగ్రెస్ పార్టీలతో పొత్తుతో వెళ్లింది. ఈ సారి మాత్రం ఒంటరిగా బరిలో దిగుతుండగా ఆ పార్టీకి 7.7 శాతం ఓటు షేరు దక్కనుంది. ఇక బీజేపీ మాజీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కు 4.6శాతం ఓటు షేరు లభించనుంది.

ఓటు షేరు వచ్చినంత మాత్రాన సీట్లు వచ్చినట్లు కాదు
ఇదిలా ఉంటే ఓటు షేరును గెలిచే సీట్లతో ముడిపెట్టడం చాలా కష్టమైన పని. అంతేకాదు ఓటు షేరు ఎక్కువగా వచ్చినంత మాత్రానా ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనేది కచ్చితంగా చెప్పలేము. ఉదాహరణకు 2014లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-జేవీఎంలకు 40.8 శాతం ఓటు షేరు లభించింది. ఆసమయంలో బీజేపీ ఏజేఎస్యూలకు కలిపి 35శాతం ఓటుషేరు లభించింది. సీట్ల పరంగా చూస్తే బీజేపీ-ఏజేఎస్యూలకు 42 సీట్లు వచ్చాయి. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్లో సగానికి పైగా సీట్లు రావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇక ఐయాన్స్ - సీఓటర్ సంస్థలు చేసిన సర్వే నిజమైతే జార్ఖండ్లో కూడా మహారాష్ట్ర రాజకీయాలనే మరోసారి చూడొచ్చనే విషయం స్పష్టమవుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు మొత్తం ఐదే దశల్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 23న కౌంటింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications