కరోనా వ్యాక్సిన్ వృథాలో జార్ఖండ్ టాప్: కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నో వేస్టెజ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ వృథాను కట్టడి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గతంలో పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ వృథా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని కరోనా వ్యాక్సిన్ల వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.
కాగా, మే నెలలో కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అతి తక్కువ కరోనా వ్యాక్సిన్ వృథా జరిగిందని కేంద్రం తాజాగా వెల్లడించింది. దీంతో కేరళ 1.10 లక్షలు, పశ్చిమబెంగాల్ రాష్ట్రం 1.61 కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా కాకుండా కట్టడి చేశాయని తెలిపింది. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో అత్యధిక కరోనా వ్యాక్సిన్ వృథా జరిగిందని, అది 33.95 శాతంగా ఉందని కేంద్రం తాజా గణాంకాలు వెల్లడించాయి.
కేరళలో -6.37 శాతం కరోనా వ్యాక్సిన్ వృథా కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో -5.48 శాతంగా ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 15.79 శాతం వ్యాక్సిన్ వృథా జరిగిందని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 7.35 శాతం వ్యాక్సిన్ వృథా నమోదైంది. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో 7.08 శాతం, 3.95 శాతం, 3.91 శాతం, 3.78 శాతం, 3.63 శాతం, 3.59 శాతం వ్యాక్సిన్ వృథా అయ్యింది.
మే నెలలో కేంద్రం నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 790.6 లక్షల వ్యాక్సిన్లు సరఫరా కాగా.. 658.6 లక్షల షాట్స్ ఉపయోగించగా, 212.7 లక్షల వ్యాక్సిన్లు నిల్వ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 902.2 లక్షల వ్యాక్సిన్ల సరఫరా కాగా, 898.7 లక్షలు వినియోగించారు. 80.8 లక్షల వ్యాక్సిన్లు నిల్వ ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 24 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.