జియాఖాన్ది ఆత్మహత్య: సిబిఐ, టైం అడిగిన తల్లి
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి కేసు మిస్టరీ వీడింది. జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సిబిఐ ధ్రువీకరించింది. ఈ కేసులో మళ్లీ విచారణ అవసరం లేదని కూడా అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సీబీఐ బాంబే హైకోర్టుకు తెలిపింది.
తాము సేకరించిన మౌఖిక, డాక్యుమెంటరీ, సైంటిఫిక్, ఫోరెన్సిక్ సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. జియా తల్లి ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, అవసరమైతే సీబీఐ ఎఫ్బీఐ సహకారం కూడా తీసుకోవాలని పిటీషన్ వేసింది.
జియా సూసైడ్ లేఖ రాయడానికి ముందు అరగంటకు పైగా తన ఫ్లాట్లోనే ఉందని, ఓ లేఖ రాయడానికి ఈ సమయం సరిపోతుందని సీబీఐ పేర్కొంది. జియా.. సూరజ్కి 400 సెకన్ల పాటు మెసేజ్లు చేసిందని ఆ తర్వాత కూడా లేఖ రాయడానికి తగిన సమయం ఉందని సీబీఐ వివరించింది.
కాగా, సీబీఐ చెప్పిన విషయాలపై తనకు సమయం కావాలని జియా ఖాన్ తల్లి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు జూలై 6వ తేదీకి వాయిదా పడింది. 2013, జూన్ 3న జియాఖాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జియా ప్రియుడు సూరజ్ పంచోలీ నిందితుడిగా కొన్ని రోజులు జైల్లో గడిపిన విషయం తెలిసిందే.