వచ్చేసిందోచ్ : జియో ఫైబర్ బేసిక్ ప్లాన్ రూ.699..మరి టాప్ ప్లాన్ ?
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన బ్రాడ్బ్యాండ్ సేవలైన జియో ఫైబర్ను అధికారికంగా గురువారం ప్రారంభించింది. అంతా ఊహించినట్లుగానే దీని ప్రారంభ ధర రూ.699గా నిర్ణయించడం జరిగింది. దీంతో హైస్పీడ్ ఇంటర్నెట్, వీడియో కాలింగ్, ఫ్రీ వాయిస్ కాల్స్ను కూడా అందిస్తోంది. గత రెండేళ్లుగా దీనిపై వర్కౌట్ చేస్తోంది రిలయన్స్ జియో సంస్థ. గత నెలలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో ఫైబర్ గురించి ప్రకటించడంతో మరోసారి బ్రాడ్బ్యాండ్ రంగంలో మరో యుద్ధం నెలకొనబోతోంది.
రూ.699 నుంచి రూ.8499 వరకు
జియో ఫైబర్ వేగం 100 ఎంబీపీఎస్ నుంచి ప్రారంభమై ఒక జీబీపీఎస్ వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక బేసిక్ ప్లాన్ రూ.699తో ప్రారంభం కానుండగా టాప్ ప్లాన్ రూ.8,499గా ఉంది. ఇక జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే సమయంలో కస్టమర్ రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందిలో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకుంటుండగా.. మరో రూ.1000 ఇన్స్టలేషన్ చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా నాన్-రీఫండబుల్.
ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి
రూ. 699 ప్లాన్తో 100ఎంబీపీఎస్తో 100జీబీ డేటాతో పాటుగా ఉచిత వాయిస్ కాల్స్, టీవీ వీడియో కాలింగ్, హైస్పీడ్ గేమింగ్ ఉంటుందని రిలయన్స్ సంస్థ తెలిపింది. ఇక రూ.849 ప్లాన్తో 200 జీబీ డేటాతో పాటు అన్ని బెనిఫిట్లు ఉంటాయి. ఇక ఇందులో అత్యంత ఖరీదైన ప్లాన్లు కూడా ఉన్నాయి. ప్లాటినం ప్లాన్ కింద 2500 జీబీ డేటాను రూ. 3,999కి అందిస్తుండగా... టైటానియం ప్లాన్ కింద 5000జీబీ డేటా రూ.8499కి అందిస్తోంది. వీటి వేగం 1జీబీపీఎస్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ రెండు ప్రీమియం ప్లాన్ల కింద వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఉంటుందని పేర్కొంది.
వార్షిక ప్లాన్ తీసుకునే వారికి ఇదే ఆఫర్
జియో గిగా ఫైబర్ ప్లాన్తో హైస్పీడ్ ఇంటర్నెట్, టెలిఫోనీ, టీవీ, సినిమాలు లాంటి బెనిఫిట్లు ఉంటాయి. ఇక వార్షిక ప్లాన్లు ఎన్నుకునే కస్టమర్లకు 4కే సెటాప్ బాక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక జియోగిగా ఫైబర్ ప్లాన్ ఎంట్రీతో అప్పటికే మార్కెట్లను శాసిస్తున్న బ్రాడ్బ్యాండ్ సంస్థలు ప్రశ్నార్థకం కానున్నాయి. ఇప్పటికే భారతీ ఎయిర్టెల్ తన కొత్త సెటాప్బాక్స్లను రూ.3999కి అందిస్తున్నట్లు ఈవారం ప్రారంభంలో ప్రకటించింది.