యూజీసీ నూతన ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తి, జేఎన్యూ వీసీ జగదీష్ కుమార్
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఛైర్మన్గా తెలంగాణకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) వీసీ ఎం జగదీష్ కుమార్ను యూజీసీ నూతన ఛైర్మన్గా నియమించారు. వాస్తవానికి యూజీసీ ఛైర్మన్ పదవి గత ఏడాది డిసెంబర్ 7 నుంచి ఖాళీగా ఉంది.
అప్పటివరకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్గా పనిచేసిన ప్రొఫెసర్ డీపీ సింగ్ 65 ఏళ్ల వయసు నిండటంతో డిసెంబర్ 7న రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో జగదీష్ కుమార్ను అపాయింట్మెంట్ చేశారు. జగదీష్ కుమార్ 2016 నుంచి జేఎన్యూ వీసీగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 26తో ఆయన ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది.

తదుపరి వీసీని నియమించే వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో ఆయనను యూజీసీ ఛైర్మన్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, జగదీష్ కుమార్కు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, దాని అనుబంధ అంశాల్లో అపారమైన అనుభవం ఉంది. ఐఐటీ మద్రాస్లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి ఆయన ఎంఎస్ (ఈఈ), పీహెచ్డీ(ఈఈ) డిగ్రీలను పూర్తిచేశారు.
కాగా, జగదీష్ కుమార్ తెలంగాణ వాసి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందినవారు. 1994 నుంచి 1995 వరకు ఐఐటీ ఖరగ్పూర్లోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా, అసెస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1997లో ఢిల్లీ ఐఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్కు అసోషియేట్ ప్రొఫెసర్గా వెళ్లారు. 2005లో ప్రొఫెసర్గా ప్రమోషన్ పొందారు. తాజాగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications