జేఎన్యూ హింసాకాండ : రాత్రి 8గం. నుంచి 11గం. వరకు ఏం జరిగింది.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారా?
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)ఆదివారం సాయంత్రం జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ముఖాలకు ముసుగులు,చేతిలో ఆయుధాలతో యూనిర్సిటీ క్యాంపస్లోకి ప్రవేశించిన 50 మంది మూక హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో జేఎన్యూఎస్యూ ప్రెసిడెంట్ అయిషీ ఘోష్ సహా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లను వ్యతిరేకిస్తున్నందుకు బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ విద్యార్థులపై దాడికి పాల్పడిందని పలువురు విద్యార్థులు ఆరోపించారు. అయితే వామపక్ష విద్యార్థులే యూనివర్సిటీలో హింసకు పాల్పడ్డారని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' సంచలన కథనం ప్రచురించింది.

పట్టించుకోని పోలీసులు :
ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 8గం. సమయంలో పోలీసులంతా జేఎన్యూ నార్త్ గేట్ వద్దకు చేరుకున్నారు. యూనివర్సిటీ క్యాంపస్లో హింస చెలరేగిందన్న సమాచారంతో దాదాపు మూడు గంటల తర్వాత వారు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన కొంతమంది మూక పోలీసుల ఎదుటే నినాదాలు చేయడం మొదలుపెట్టింది. 'దేశద్రోహులను కాల్చిపారేయండి', 'నక్సల్వాద్ డౌన్ డౌన్', 'మావోవాద్ కాదు,నక్సల్వాద్ కాదు,అందరినిమించినవాళ్లు జాతీయవాదులు' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అంబులెన్స్ పంక్చర్ చేసి..:
మూకదాడిలో గాయపడి నెత్తురోడుతున్న విద్యార్థులను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు క్యాంపస్ గేట్ వద్దకు అంబులెన్సులు చేరుకోగా.. సదరు మూక వాటిని అడ్డగించింది. అంతేకాదు,అంబులెన్సుల టైర్లలో గాలి తీసి,వాహనాల అద్దాలను పగలగొట్టింది. ఇదంతా పోలీస్ డిటెన్షన్ వ్యానుకు సమీపంలోనే జరిగింది. ఇంతా జరుగుతున్నా అక్కడి పోలీసులు వారి చేష్టలను చూస్తుండిపోయారు. 'పోలీస్ జిందాబాద్..' అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జర్నలిస్టులకు బెదిరింపులు :
పలువురు జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా సదరు మూక వారిని బెదిరించింది. దగ్గరకు రావద్దు అంటూ హెచ్చరించింది. స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ను అడ్డుకుని దాడికి పాల్పడింది. దాదాపు 250 మంది పోలీసుల ఎదుటే ఆ మూక ఇంతలా రెచ్చిపోయింది. అక్కడున్నవారిలో చాలామంది ఏబీవీపీ,ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలకు చెందినవారేనని వెల్లడించారు. పేరు చెప్పడానికి ఇష్టపడలేదు కానీ తమ విద్యార్థి సంఘాల పేర్లను మాత్రం వెల్లడించారు. ఆ సమయంలో వారి చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి.
Recommended Video

యోగేంద్ర యాదవ్పై దాడి.. :
క్యాంపస్ నుంచి గూండాలను పంపించే దమ్ము లేని పోలీసులు తనను మాత్రం అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా ఆదేశించారని యోగేంద్ర యాదవ్ వాపోయారు. జేఎన్యూ అధ్యాపకులతో మాట్లాడుతున్న సమయంలో.. తనవల్లే ఉద్రిక్తత ఏర్పడుతోందని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆపై అక్కడే ఉన్న గూండాలు తనను కిందపడేశారని చెప్పారు.

దాడి సమయంలో వీధి లైట్లు లేవు :
సదరు మూక క్యాంపస్లోకి ప్రవేశించిన సమయంలో వీధి లైట్లను ఆపేశారు.ఆ చీకట్లోనే హాస్టళ్లలోకి చొరబడి హింసాకాండకు పాల్పడ్డారు. వారిలో ఏబీవీపీకి చెందిన జేఎన్యూ విద్యార్థి సురేష్ అనే వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని,చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని దాడికి పాల్పడటం గుర్తించామని వామపక్ష విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు వామపక్ష విద్యార్థులే గొడవకు కారణమయ్యారని,మొదట వారే తమ విద్యార్థులపై దాడి చేశారని ఏబీవీపీ ఆరోపిస్తోంది. జేఎన్యూ టీచర్ అసోసియేషన్ సురాజిన్ మజుందార్ కూడా ఇదే చెప్పారు.

రాత్రి 10.45గంటలకు :
రాత్రి 10.45గంటలకు ఆ మూక జేఎన్యూ గేట్కు అవతలి వైపు ఉన్న రహదారి వైపు వెళ్లిపోయింది. ఆ తర్వాత 11గంటలకు క్యాంపస్లోని స్ట్రీట్ లైట్స్ ఆన్ చేశారు. ఆ తర్వాత వామపక్ష విద్యార్థులంతా అక్కడికి చేరుకుని మానవహారంలా ఏర్పడి ఏబీవీపి విద్యార్థులు,ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 10.45గంటల సమయంలో సీపీఎం నేత డి.రాజా క్యాంపస్ వద్దకు రాగా.. అక్కడున్న మూకలో కొంతమంది ఆయన్ను పరుష పదజాలంతో దూషించారు. గో బ్యాక్ అంటూ ఆయన్ను చుట్టుముట్టారు. ఇది ఫాసిజం తప్ప మరొకటి కాదని,ఢిల్లీ పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని ఆయన ఆరోపించారు. జరిగిన ఉదంతంపై విచారణ జరుపుతున్నామని డీసీపీ దేవేందర్ ఆర్య తెలిపారు.












Click it and Unblock the Notifications