మోడీ కేబినెట్ నుంచి తప్పించే కుట్ర? సొంత పార్టీ నేతలపై బీజేపీ మంత్రి షాకింగ్..!
ఓవైపు కేంద్ర కేబినెట్ (union cabinet) ప్రక్షాళనకు ప్రధాని మోడీ సిద్ధమవుతున్న వేళ ఆయన కేబినెట్లోనే ఉన్న ఓ మంత్రి దీనిపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. తనను కేబినెట్ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతలు ఈ మేరకు కుట్రలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర పార్టీల నుంచి బీజేపీ నాయకులే ఇలాంటి పనులు చేస్తున్నారని సదరు మంత్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు కేబినెట్ ను కుదిపేస్తున్నాయి.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ నేత జ్యూయర్ ఓరం (Jual Oram) సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రధాని మోడీ ప్రయత్నాలు చేస్తున్న వేళ.. తనను కూడా తప్పించేందుకు ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో చేరిన నేతలు ప్రయత్నిస్తున్నారని ఓరం ఆరోపించారు. వారు తనను అప్రతిష్టపాలు చేసి, కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించేందుకు ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో, కొందరు వ్యక్తులు డబ్బు ఖర్చు చేసి తనను అప్రతిష్టపాలు చేయడానికి, తమ స్థానాన్ని దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఓరం ఆరోపించారు. అలా చేయడం ద్వారా తమకు అవకాశం దక్కుతుందని వారు భావిస్తున్నారని ఆయన తెలిపారు.

అయినా తన పార్టీ గురించి తనకు బాగా తెలుసని, అలాగే తన కృషిని కూడా అది గుర్తిస్తుందని ఓరం వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్గఢ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓరం.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన వారికి గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ వ్యవహారంపై ఒడిశా బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీతో ఇప్పటికే చర్చించినట్లు పేర్కొన్న ఓరం.. వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. తనను అప్రతిష్టపాలు చేసేవారి చేతులను నరికే సత్తా, అలాగే వాటిని దహనం చేసే సత్తా తనకు ఉందన్నారు. జ్యూయర్ ఓరం గిరిజన ప్రాబల్యం కలిగిన సుందర్గఢ్ లోక్సభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓరం వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ తీవ్రంగా స్పందించాయి.
ఓరం వ్యాఖ్యలతో బీజేపీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని విమర్శించాయి.














Click it and Unblock the Notifications