భారత్ పాక్ సరిహద్దులో హఫీజ్ ‘కొడుకు’ కలకలం
లాహోర్/న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి (మాస్టర్ మైండ్) హఫీజ్ సయిద్ తనయుడు తల్హా సయిద్ భారత్ -పాకిస్తాన్ సరిహద్దులో కలకలం సృష్టిస్తున్నాడు. తనను, తన అనుచరులను కాశ్మీర్ పంపించాలని డిమాండ్ చేశాడు.
మంగళవారం సాయంత్రం పొద్దు పోయిన తరువాత 10 భారీ ట్రక్కుల్లో ఆహార పదార్థాలు, వైద్య సామాగ్రి తీసుకుని చికోటిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (నియంత్రణ రేఖ) చెక్ పాయింట్ దగ్గరకు తల్హా సయిద్ చేరుకున్నాడు.
అతని వెంట అధిక సంఖ్యలో అనుచరులు ఉన్నారు. ట్రక్కులు తీసుకుని తాము కాశ్మీర్ వెలుతామని, మీరు అంగీకరించాలని అక్కడ ఉన్న అధికారులకు చెప్పాడు. భారత్ లోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేశారు.
పాక్ భద్రతా బలగాలు, పోలీసులు వారిని అడ్డుకున్నారు. తల్హా తన అనుచురులతో కలిసి చికోటి చెక్ పాయింట్ వద్ద బైఠాయించి ధర్నా చేశాడు. బుధవారం వీరి ఆంధోళన కొనసాగుతున్నది. ఆహారం, వైద్య సామాగ్రి కాశ్మీర్ సోదరులకు పంపించే వరకు తాము ఇక్కడే బైఠాయిస్తామని పలు వార్త సంస్థలకు ఇంటర్వూ ఇచ్చాడు.
భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. తల్హా తండ్రి సయిద్ లాగే అతను ఇస్లామిక్ ప్రోఫెసర్. జమాత్- ఉల్- దవా సోదర సంస్థ ఫలె -ఇ- ఇన్సానియత్ ఫౌండేషన్ కు ఇతను చైర్మెన్ గా వ్యవహరిస్తున్నాడు.
కాశ్మీర్ లో ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తరువాత అక్కడ ఆందోళనలు చెలరేగాయి. దాదాపు 50 మంది పౌరులు చనిపోయారు. 2 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ గొడవలను అనుకూలంగా చేసుకుని కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టాలని తల్హా సయిద్ ప్రయత్నించాడు.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ పర్యటన అడ్డుకుంటామని పాక్ ఉగ్రవాదులు హెచ్చరించారు. బుధవారం పాక్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి.