నిర్భయ కేసులో తీర్పుపై నేరస్తుల తరఫు లాయర్ సంచలనం
నిర్భయ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పుపై నిందితుల తరఫు న్యాయవాది (డిఫెన్స్ లాయర్) ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పుపై నేరస్తుల తరఫు న్యాయవాది (డిఫెన్స్ లాయర్) ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్భయ కేసులో నలుగురుకి ఉరిశిక్ష విధించడాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ నిర్భయ కేసులో సుప్రీం తీర్పు: నలుగురికి ఉరిశిక్ష ఖరారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీం ఈ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. నిర్భయ పట్ల అమానుషంగా వ్యవహరించిన వారికి ఉరే సరైందని చెప్పింది. ఈ కేసులో కింది కోర్టులు ఇచ్చిన మరణశిక్ష తీర్పునే సమర్థించింది.
అహింసా సిద్ధంతానికి విరుద్ధం
దీనిపై ఏపీ సింగ్ మాట్లాడారు. మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింసా సిద్ధాంతానికి ఇది విరుద్ధమని, మమ్మాటికి ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని వ్యాఖ్యానించారు. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఏదో సందేశం ఇవ్వాలని..
సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో కోర్టులు ఉరిశిక్షలు వేయడం సరికాదని ఏపీ సింగ్ అన్నారు. నిర్భయ కేసులో ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుతో మానవ హక్కులు హత్యకు గురయ్యాయన వ్యాఖ్యానించారు. తమకు న్యాయం జరగలేదన్నారు. తీర్పు కాపీ అందిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్పారు.
జీవించే హక్కు ఉంది
దేశానికి సందేశం ఇచ్చేందుకు ఉరిశిక్ష వేయడం ఏమిటని గర్హించారు. శిక్ష అంటే నేరస్తుల్లో మార్పు కలిగేలా ఉండాలని ఏపీ సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని చెప్పారు.
సంచలనం సృష్టించిన నిర్భయ కేసు
కాగా, నిర్భయ కేసులో నలుగురు నిందితులు ముఖేష్, పవన్, వినయ్, అక్షయ్లకు సుప్రీం ఉరిశిక్షను సమర్థిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2012 డిసెంబర్ 12న ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే.
ఒకరు జైల్లోనే ఆత్మహత్య
ఈ కేసులో మరణశిక్షను సవాల్ చేస్తూ నలుగురు దోషులు ముఖేశ్, వినయ్, అక్షయ్, పవన్లు చేసుకున్న అప్పీళ్లను సుప్రీం శుక్రవారం తిరస్కరించింది. వైద్య విద్యార్థిని నిర్భయపై కిరాతకంగా వ్యవహరించిన ఆరుగురిలో ఒకరు (రాంసింగ్) శిక్ష అనుభవిస్తూ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
బయటకు వచ్చిన మైనర్
మరో నిందితుడు మైనర్ కావడంతో బయటకు వచ్చాడు. మిగిలిన నలుగురురికి మరణశిక్షను విధిస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.