తీసుకోను, సుప్రీం తనను తానే ఎగతాళి చేసుకుంటోంది: కర్ణన్
బెయిలబుల్ వారంట్ను తీసుకోవడానికి కర్ణన్ నిరాకరించారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టుపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.
కోల్కతా : కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ తనపై సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారంట్ను తిరస్కరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిలబుల్ వారంట్ను జస్టిస్ కర్ణన్కు అందజేయడానికి పశ్చిమ బెంగాల్ డీజీపీ సురజిత్ కర్ పురకాయస్థ మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కర్ణన్ నివాసానికి వచ్చారు. వెంట వంద మంది పోలీసులను కూడా తెచ్చుకున్నారు.
వారంట్ జారీ: వంద మంది పోలీసులతో కర్ణన్ ఇంటికి డిజిపి
సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట ఈ నెల 31న హాజరు కావాలని పేర్కొంటున్న ఆదేశాలను ఆయనకు అందజేశారు.మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల్లో చాలా మంది అవినీతిపరులు ఉన్నట్లు జస్టిస్ కర్ణన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనపై చర్యలు ప్రారంభించింది. బెయిలబుల్ వారంట్ను తాను తిరస్కరిస్తున్నట్లు జస్టిస్ కర్ణన్ తన సమాధానంలో రాశారు.
అప్రతిష్ఠపాలు చేసే ఇటువంటి చర్యలకు న్యాయమూర్తులు పాల్పడటం దళిత న్యాయమూర్తిని తీవ్రంగా బాధించేందుకు చట్టానికి అతీతమైన అకృత్యాలకు ఒడిగట్టజమేనని ఆయన తన సమాధానంలో అన్నారు, అందువల్ల మన న్యాయస్థానాల గౌరవ, మర్యాదలను పెంపొందించేందుకు మీ తదుపరి వేధింపులను ఆపాలని కోరుతున్నానని రాశారు. ఇది వారంట్పై తన ఆదేశమని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఉద్దేశించి రాశారు.
జస్టిస్ కర్ణన్ శుక్రవారం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. బెయిలబుల్ వారంట్ను జారీ చేయడం ద్వారా సుప్రీంకోర్టు తనను తాను నవ్వుల పాలు చేసుకుంటోందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకుంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు జస్టిస్ కర్ణన్ సమాధానమిస్తూ తాను న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు.