బాలుడిపై జువెనైల్ హోం వార్డెన్ లైంగిక దాడి: చిత్రహింసలు
ముంబై: ఓ జువెనైల్ హోం వార్డెన్ ఓ బాలున్ని చిత్రహింసలు పెట్టి అతడి చావుకు కారణమయ్యాడు. ముంబైలోని మతుంగాలో ఉన్న డేవిడ్ సస్సూన్ జువెనైల్ హోం వార్డెన్ గజానన్ పఖరే కర్కశానికి అమీర్ అహ్మద్ (17) అనే బాలుడు అన్యాయంగా బలయ్యాడు.
దొంగతనం కేసులో ఆమిర్ అహ్మద్ను గత నెల 17న పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ హోంకు తరలించారు. అయితే, ఈ నెల 18న రాత్రి అమీర్ మరో ఇద్దరితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వార్డెన్ పఖరే, సీనియర్ జువెనైల్ కరీంషేక్ కలిసి పట్టుకొని వెదురు కర్రలు, క్రికెట్ బ్యాట్లతో అమీర్ను తీవ్రంగా కొట్టారు.
ఈనెల 20 బెయిల్పై విడుదలైన అమీర్ ఆరోగ్యం క్షీణించటంతో అతని కుటుంబసభ్యులు నాయర్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమీర్ గురువారం మరణించాడు.
వార్డెన్, సీనియర్ జువెనైల్స్ తనను తీవ్రంగా కొట్టారని అమీర్ చనిపోయేముందు వాగ్మూలం ఇచ్చాడని పోలీస్ డిప్యూటీ కమిషనర్ మహేశ్ పాటిల్ శుక్రవారం తెలిపారు. అతనిపై తోటి జువెనైల్స్ లైంగికదాడికి కూడా పాల్పడినట్లు అమీర్ చెప్పాడు.