'స్టార్ క్యాంపెయినర్' వివాదం... ఈసీ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన కమల్నాథ్...
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ఎన్నికల కమిషన్(ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో తన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేయడాన్ని శనివారం(అక్టోబర్ 31) ఆయన సుప్రీంలో సవాల్ చేశారు.
'ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకూడదు. ఒకరకంగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటిదే...' అని కమల్నాథ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు,స్టార్ క్యాంపెయినర్గా తన హోదాను తొలగించడంపై ఈసీ నుంచి ఇంతవరకూ తనకెలాంటి నోటీసులు అందలేదని చెప్పారు.

సీనియర్ న్యాయవాది,కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా మాట్లాడుతూ.. ఈసీ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొంటూ కమల్నాథ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఒకరకంగా ఇది తనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ద హక్కులకు విఘాతం కలిగించడమేనని అందులో పేర్కొన్నారు.
ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారన్న కారణంతో కమల్నాథ్కు స్టార్ క్యాంపెయినర్ హోదాను ఈసీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ మంత్రి,బీజేపీ నేత ఇమర్తి దేవిని 'ఐటమ్' అని కమల్నాథ్ విమర్శించడం తీవ్ర దుమారం రేకెత్తించింది. దీనిపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో... కమిషన్ కమల్నాథ్ వివరణ కోరింది. అయితే ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈసీ.. ఆయన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
కాగా,నవంబర్ 3న మధ్యప్రదేశ్లోని 28 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో 27 స్థానాలు గతంలో కాంగ్రెస్ గెలిచినవే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications