కోర్టులో నటి పూజాగాంధీ అరెస్టు
బెంగళూరు: ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసు విచారణకు సక్రమంగా హాజరుకానందున కన్నడ నటి, నిర్మాత ముంగారుమలే ఫేం పూజాగాంధీని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత పూజాగాంధీకి షరతులతో కూడిన జామీను మంజూరు అయ్యింది.
పోలీసుల అదుపులో ఉన్న సమయంలో పూజాగాంధీ జైలుకు వెళ్లవలసి వస్తుందని హడలిపోయింది. ఆమె ముఖం రంగులు మారింది. 2013 శాసనస సభ ఎన్నికలు జరిగిన సమయంలో బళ్లారి సమీపంలోని రాయచూరు నియోజక వర్గం నుండి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పూజాగాంధీ పోటి చేశారు.
ఆ సమయంలో పూజాగాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల అధికారుల దగ్గర అనుమతి తీసుకోకుండా ప్రయివేటు వాహనంలో సంచరించారని కేసు నమోదు చేశారు. అప్పటి నుండి రాయచూరు కోర్టులో కేసు విచారణలో ఉంది. కేసు విచారణకు పూజాగాంధీ సక్రమంగా హాజరుకావడం లేదని రాయచూరు రెండవ జేఎంఎఫ్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సోమవారం ఉదయం పూజాగాంధీ తన న్యాయవాదితో కలిసి కోర్టు ముందు హాజరైనారు. బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశారు. అయితే కోర్టు విచారణకు సక్రమంగా హజరుకాని పూజాగాంధీని అరెస్టు చెయ్యాలని న్యాయమూర్తి అక్కడే ఉన్న పోలీసులకు సూచించారు.
పోలీసులు పూజాగాంధీని అరెస్టు చేశారు. బిత్తరపోయిన పూజాగాంధీ న్యాయవాది బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీ విచారణ మద్యాహ్నం12.30 గంటలకు వాయిదా వేశారు. ఆ సమయంలో పోలీసుల అదుపులో ఉన్న పూజాగాంధీ హడలిపోయింది
అర్జీ విచారణ చేసిన న్యాయమూర్తి షరతులతో కూడిన జామీను మంజూరు చేశారు. అదే విధంగా రూ. 500 అపరాధ రుసం చెల్లించాలని పూజాగాంధీకి సూచించారు. అపరాధ రుసం చెల్లించిన పూజాగాంధీ తన న్యాయవాదితో కలిసి బయటకు వచ్చారు.