కరోనా విషాదం: బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి ఆత్మహత్య - కొవిడ్ వార్డు నుంచి కిందికి దూకి..
కరోనా వైరస్ వల్ల మనిషి శరీరంపై పడే ప్రభావం కంటే.. అది సోకిన రోగులు.. మానసికంగా, సామాజికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటుండటం విచారకరం. కరోనా మరణాల్లాగే, భయంతో బలవన్మరణానికి పాల్పడుతోన్న వాళ్లలోనూ అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. కరోనా వైరస్ సోకిందన్న బాధతో బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో సంచలనంగా మారింది.
కన్నౌజ్ జిల్లా తిర్వాగంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ రాజ్ పుత్ సోదరుడు సంజయ్ రాజ్ పుత్(45) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సంజయ్, ఆయన భార్య కన్నౌజ్ లోని మెడికల్ కాలేజీ కొవిడ్ సెంటర్ లో చేరారు. కొవిడ్ చికిత్స పొందుతోన్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తరువాత సడెన్ గా బిల్డింగ్ పైకి పరుగెత్తు.. అక్కడి నుంచి కిందికి దూకారు.
కొవిడ్ సెంటర్ పై నుంచి సంజయ్ రాజ్ పుత్ కిందికి దూకారన్న సమాచారం తెలిసిన వెంటనే ఆయన సొదరుడు, ఎమ్మెల్యే కైలాష్ రాజ్ పుత్ పోలీసులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. తల నేలకు బలంగా ఢీకొనడంతో సంజయ్ స్పాట్ లోనే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా, సంజయ్ కరోనా డిప్రెషన్ తోనే చనిపోయాడా? లేక ఇంకేవైనా కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.
Recommended Video
అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 6074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తం 2.53 లక్షల కేసులు నమోదుకాగా, 3,767 మంది ప్రాణాలు కోల్పోయారు. మెరుగైన రికవరీ రేటుతో 1.9లక్షల మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 58,595గా ఉంది.