భారత్ ఓకె అంటే.. ఆ సాయానికి సిద్దం... ఖర్చు కూడా మాదే.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఫౌండేషన్ ఆఫర్...
కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడుతున్న భారత్కు పలు దేశాలు,అంతర్జాతీయ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే యూకె,అమెరికా,ఫ్రాన్స్,జర్మనీ,ఆస్ట్రేలియా దేశాలు భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. తాజాగా పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా పనిచేసే అబ్దుల్ సత్తార్ ఎది ఫౌండేషన్ కూడా భారత్కు అండగా నిలిచింది. కరోనాపై పోరులో భారత్కు తమవంతుగా 50 అంబులెన్సులు పంపించేందుకు సిద్దమని ప్రకటించింది. అంతేకాదు,ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్,ఆఫీస్ స్టాఫ్,అంబులెన్స్ డ్రైవర్స్,ఇతరత్రా సిబ్బందిని కూడా భారత్ పంపిస్తామని వెల్లడించింది.
మానవతా దృక్పథంతో...
ప్రపంచంలోనే అతిపెద్ద అంబులెన్సు నెట్వర్క్ను కలిగిన సంస్థల్లో అబ్దుల్ సత్తార్ ఎది ఫౌండేషన్ కూడా ఒకటి. ఇది ఒక స్వతంత్ర సంస్థ. పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ... అక్కడి ప్రభుత్వంతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం భారత్ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో అబ్దుల్ సత్తార్ ఎది సంస్థ భారత్కు అంబులెన్సులను పంపించేందుకు సిద్దమని ప్రకటించింది.
ఆ ఖర్చు కూడా తామే భరిస్తామని లేఖ...
అబ్దుల్ సత్తార్ ఎది ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఫైజల్ ఎది ఏప్రిల్ 23న భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేశారు. భారత్కు తాము సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. భారత ప్రభుత్వం అనుమతిస్తే తమ టీమ్ అక్కడికి వచ్చి సేవలు అందిస్తుందన్నారు. అంతేకాదు,తమకు టీమ్కు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామన్నారు. అంబులెన్సులకు ఉపయోగించే ఇంధనం,సిబ్బందికి భోజనం,తదితర వసతులన్నీ తామే చూసుకుంటామన్నారు.ఫైజల్ ఎది తండ్రి పేరు మీదుగానే అబ్దుల్ సత్తార్ ఎది ఫౌండేషన్ ఏర్పాటైంది. ఆయన తండ్రి అబ్దుల్ సత్తార్ ఎది దేశ విభజనకు ముందు భారత్లోనే ఉండేవారు. గుజరాత్లోని కతియవార్లో ఉన్న బంత్వాలో ఆయన జన్మించారు. 1947లో దేశ విభజన సమయంలో ఆయన పాకిస్తాన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
అప్పట్లో భారత మత్స్యకారులకు అండగా...
ఇండియా-పాకిస్తాన్ పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ మాజీ జనరల్ సెక్రటరీ,పీస్ యాక్టివిస్ట్ జతిన్ దేశాయి మాట్లాడుతూ... దివంగత అబ్దుల్ సత్తా ఎది సామాజిక సేవ విషయంలో మదర్ థెరిసాతో పోల్చదగినవారని చెప్పారు. ఆయన ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు.పాకిస్తాన్ జైళ్ల నుంచి భారత మత్స్యకారులు విడుదలైన సమయంలో వారే దగ్గరుండి అన్ని చూసుకున్నారని గుర్తుచేశారు. ఆ మత్స్యకారులు వాఘా బోర్డర్ చేరేవరకూ ట్రాన్స్పోర్ట్,భోజనం ఇతరత్రా అన్ని ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే వారికి అందినట్లు తెలిపారు.
దేశాలు వేరైనా మానవత్వంతో...
భారత్-పాక్ రెండు దేశాలుగా విడిపోయినప్పటికీ ఒకరి కోసం ఒకరు నిలబడ్డ సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయని కొంతమంది గుర్తుచేస్తున్నారు. పాకిస్తాన్కి చెందిన ఎడిటర్,డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ బీనా సర్వర్ మాట్లాడుతూ... గతంలో పాకిస్తాన్కు చెందిన కొంతమంది చిన్నారులకు భారత్లో గుండె సంబంధిత చికిత్స అందించారని గుర్తుచేశారు. అలాగే భారత్లో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కొంతమంది చిన్నారులకు పాకిస్తాన్ దాతలు సాయం అందించారని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ... కష్ట కాలంలో ఇరు దేశాల పౌరులు ఒకరికొకరు అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయన్నారు.
గీతకు ఆశ్రయం కల్పించింది ఈ సంస్థే...
చిన్నతనంలోనే తప్పిపోయి పాకిస్తాన్ చేరిన భారతీయ యువతి రాధా వాఘ్మేర్ను చేరదీసి ఆశ్రయం కల్పించింది కూడా అబ్దుల్ సత్తార్ ఎది ఫౌండేషనే. చాలా ఏళ్ల పాటు ఆమె అక్కడే ఆశ్రయం పొందింది. ఆమె హిందూ యువతి అని తెలిసి ఫౌండేషన్ సభ్యులే ఆమెకు గీత అని పేరు పెట్టారు. 2015లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో గీత ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టింది. ఇటీవలే మహారాష్ట్రలోని పర్బనీలో గీత మాతృమూర్తి ఆచూకీ దొరికిందని... ఆమె తన తల్లి చెంతకు చేరినట్లు కథనాలు కూడా వచ్చాయి. ఏదేమైనా మానవతా దృక్పథంతో పనిచేసే అబ్దుల్ సత్తార్ ఎది ఫౌండేషన్ కష్టకాలంలో భారత్కు అండగా నిలిచేందుకు ముందుకు రావడంపై హర్షం వ్యక్తమవుతోంది.