కార్గిల్: సునీల్ శెట్టి తన పాత్ర పోషించారన్న జవాన్
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధం జరిగిన నేటికి 15ఏళ్లు అయింది. కార్గిల్ యుద్ధం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగింది. 1999లో మే నుంచి జులై వరకు జరిగిన ఈ యుద్ధంలో ఎందరో భారత సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి భారత్కు విజయాన్నందించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జులై 26న ‘కార్గిల్ విజయ్ దివాస్' పేరిట అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటోంది భారత్. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు పలువురు మంత్రులు, అధికారులు అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు.
యుద్ధంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా దేశం కోసం పోరాడి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన నలుగురు సైనికులను జనవరి 26, 2000 సంవత్సరంలో దేశ అత్యున్నత మిలిటరీ పురస్కారమైన పరమ వీర చక్ర అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డును అందుకున్న వారిలో రైఫిల్మెన్ సంజయ్ సింగ్ ఒకరు. 2003లో కార్గిల్ యుద్ధాన్ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ‘ఎల్ఓసి కార్గిల్' చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి.. సంజయ్ కుమార్ పాత్రను పోషించారు.
కార్గిల్ 15వ విజయ్ దివాస్ నేపథ్యంలో వన్ఇండియా భారత సైనికుడు సంజయ్ సింగ్తో ప్రత్యేక ఇంటర్వ్యూను నిర్వహించింది. అతడు జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ 13వ బెటాలియన్కు చెందిన సైనికుడు.
కెప్టెన్ విక్రమ్ బత్రా మరణం
ప్రతి ఏడాది కార్గిల్ను సందర్శించే సంజయ్ సింగ్.. కెప్టెన్ విక్రమ్ బత్రాతో ఉన్న తన అనుభవాలను పంచుకున్నారు. ‘రెజిమెంట్స్ వేరైనప్పటికీ.. మేము చాలా చాలా సన్నిహితులం. మేమిద్దరం చాలా సార్లు కలుసుకుని మాట్లాడుకునే వాళ్లం' అని చెప్పారు.
‘కెప్టెన్ బత్రా చాలా ప్రతిభగల యువ అధికారి. మర్యాదస్తుడు. ప్రతి ఒక్కర్నీ సహృదయంతో పలకరించేవాడు. అతను యుద్ధం సమయంలో మరణించాడని వార్తను నేను నమ్మలేకపోయాను. ఇప్పటికీ నేను అతడ్ని చాలా మిస్సవుతున్నాను' అని సంజయ్ సింగ్ తెలిపారు.
‘నేను ఎప్పుడు కార్గిల్, ద్రాస్ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆనందంతోపాటు బాధ కూడా వేస్తుంది. మన దేశ సరిహద్దుల్లోకి వచ్చిన శత్రువులను తరిమికొట్టామనే ఆనందంతోపాటు ఆ యుద్ధంలో మన సైనికులను చాలా మందిని కోల్పోయామనే బాధ కూడా ఉంటుంది' అని చెప్పారు.
‘ఆ అనుభవాలను చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆ పరిస్థితిని తలచుకుంటేనే కళ్ల వెంట నీరు వస్తుంది. 15ఏళ్ల వయస్సున్న ఓ బాలుడి అప్పుడు గాయానికి గురయ్యాడు. ఇప్పటికీ అతను కోలుకోలేకపోయాడు' అని పేర్కొన్నారు.
ఎల్ఓసి కార్గిల్ చిత్రంలో సునీల్ శెట్టి నా పాత్రను పోషించారు
‘బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నా పాత్రను 2003లో రూపొందించిన ఎల్ఓసి కార్గిల్ చిత్రంలో పోషించారు. ఈ చిత్రాన్ని జెపి దత్ నిర్మించారు' అని తెలిపారు. మీ పాత్రను చిత్రంలో చూసుకున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందని ప్రశ్నించగా.. సునీల్ శెట్టి తనను కలిశారని, తాను కొన్ని రోజులపాటు ముంబైలో ఉన్నట్లు తెలిపారు.
‘మేము ఈ చిత్రంతో అమరులైన మన సైనికులకు ఘన నివాళులర్పించాలని అనుకుంటున్నాం. మా ఈ ప్రయత్నం మన సైనికులు చేసిన త్యాగాలు ముందు ఏ మాత్రం సరిపోదు' అని సునీల్ శెట్టి తనతో అన్నట్లుగా ఆయన చెప్పారు.