అనుమతి ఇస్తే అపోలోలో జయలలిత చికిత్స ఫోటోలు విడుదల చేస్తాం: రెఢీ!
చెన్నై: జయలలిత ఆనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు అన్ని పరీక్షలు సవ్యంగా చేశారని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నాడీఎంకే (శశికళ వర్గం) కర్ణాటక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుహళేంది అన్నారు.
అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చెయ్యడంతో అందుకు నిరసనగా బుధవారం తమిళనాడులోని మదురైలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూహళేంది నాయకత్వం వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

అపోలో ఆసుపత్రిలో
జయలలిత అనారోగ్యానికి గురైన తరువాత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించారని పుహళేంది చెప్పారు. ఆ సందర్బంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు అమ్మను చూశారని అన్నారు.

అప్పుడు పన్నీర్ సెల్వం ఉన్నారు
అపోలో ఆసుపత్రిలో జయలిత చికిత్స పొందుతున్న సమయంలో పన్నీర్ సెల్వం ఆసుపత్రికి వచ్చి వెలుతున్న విషయం ప్రజలు అందరికీ తెలుసు అన్నారు. జయలలితకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ? అనే విషయం పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారని వివరించారు.

అమ్మ మరణించిన తరువాత
చికిత్స విఫలమై జయలలిత మరణించిన తరువాత పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. జయలలిత మరణించిన తరువాత రెండునెలల పాటు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పూర్తి అధికారంలో ఉన్నారని పూహళేంది గుర్తు చేశారు.

సీబీఐ దర్యాప్తుకు పన్నీర్ సెల్వం ఓకే చెప్పలేదు
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ఉన్న సందర్బంలో అమ్మ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయించడానికి ఆయన ఎందుకు వెనకడుగు వేశారు ? అధికారం పోయిన తరువాత ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చెయ్యాలని ఎందుకు అడుగుతున్నారు ? అని పూహళేంది ప్రశ్నించారు.

అపోలోలో జయలలిత ఫోటోలు తీశారు
అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఫోటోలు తీశారని, వాటిని విడుదల చెయ్యడానికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, ఆఫోటోలు విడుదల అయితే అందులో ఎవరెవరు ఉన్నారు అనే విషయం ప్రజలకు పూర్తిగా తెలుస్తోందని పూహళేంది చెప్పారు. అయితే ఫోటోలు విడుదల చెయ్యడానికి ఎవరి అనుమతి కావాలి అంటూ మీడియా ప్రశ్నిస్తే అందుకు ఆయన సమాధానం దాటవేశారు.

కొడనాడు బంగ్లా ఓ దేవాలయం
జయలలిత కొడనాడు ఎస్టేట్ ఓ దేవాలయం అని, అక్కడ చోరీ చెయ్యడానికి హత్య చేసిన నిందితులను అమ్మ జయలలిత శిక్షిస్తున్నారని పూహళేంది అన్నారు. తన బంగ్లాలో హత్య చేసి చోరీ చేసిన వారిని స్వయంగా జయలలిత నిందితులను రోడ్డు ప్రమాదాల్లో చంపేసి శిక్షిస్తున్నారని, అమ్మ అంటే దేవత అని పూహళేంది వివరించారు. ఇదే సందర్బంలో టీటీవీ దినకరన్ అరెస్టును పూహళేంది ఖండించారు.

పూహళేంది పనికిరాని లీడర్
కర్ణాటకు చెందిన పూహళేందికి తమిళనాడు రాజకీయాల గురించి ఏమి తెలుసు ? అపోలో ఆసుపత్రిలో జయలలితను ఆయన ఎప్పుడు చూశారు అంటూ పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు కేపి మునిసామి ప్రశ్నించారు.

పూహళేంది ఓ దద్దమ్మ
దమ్ముంటే జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోలు విడుదల చేసి తరువాత మాట్లాడాలని కేపీ మునిసామి సవాలు విసిరిరారు. పూహళేంది పనికిరాని లీడర్, ఆయన ఓ దద్దమ్మతో సమానం అంటూ కేపీ మునిసామి మండిపడ్డారు.

జయలలితకు బెయిల్ ఇచ్చిన పూహళేంది
జయలలితను మొదటి సారి కర్ణాటక పోలీసులు అరెస్టు చేసిన సమయంలో పూహళేంది స్వయంగా జామీను ఇచ్చారు. అప్పటి నుంచి అమ్మకు సన్నిహితంగా ఉంటున్నాడు. ఇంత కాలం కర్ణాటకలో పార్టీ కార్యకలాపాలు చూసుకున్న పూహళేంది జయలలిత మరణించడం, శశికళ జైలుకు వెళ్లడంతో ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు చెయ్యడం మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications