మతం, అభివృద్ది మధ్య పోటీ, మోడీ హవా ఉండదు, హిందీ రాష్ట్రం కాదు: సీఎం సిద్దూ
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ నాయకులు మత విధ్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని, అది సాధ్యం కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో సాగిన బీజేపీ ఆటలు కర్ణాటకలో సాగవని, ఈ రాష్ట్రానికి ఓ ప్రత్యేక ఉందని, హిందీ బాష మాట్లాడే రాష్ట్రం కాదని, ప్రధాని మోడీ హవా ఉండదని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక నవనిర్మాణ యాత్రలో ఉన్న సీఎం సిద్దరామయ్య ఉడిపిలో'ఒన్ ఇండియా'కు ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చారు.
హిందువులు ఒక్కటే
బీజేపీ ఆరోపణలు చేస్తున్నట్లు సాఫ్ట్ హిందుత్వం, హార్డ్ హిందుత్వం లేదని, హిందువులు అందరూ ఒక్కటే అని సీఎం సిద్దరామయ్య చెప్పారు. అయితే బీజేపీ హిందుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు.
Recommended Video
మోడీ హవా ఉండదు
కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సిద్దాంతాలకు, బీజేపీ సిద్దాంతాలకు మధ్య పోటీ ఉంటుందని సిద్దరామయ్య అన్నారు. అంతే కాని ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు మధ్య పోటీ ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ది మంత్రంతో ఎన్నికలకు వెలుతుంటే బీజేపీ మాత్రం హిందుత్వం అనే ఒక్క అజెండాతో బరిలోకి దిగుతోందని సిద్దరామయ్య చెప్పారు.
బీజేపీకి అంత సీన్ లేదు
దక్షిణ కర్ణాటకలో బీజేపీ చాల బలహీనంగా ఉందని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఉదాహరణకు మైసూరు జిల్లాలో ఒక్క క్రిష్ణరాజనగరలో మినహా జిల్లాలో ఎక్కడా బలమైన అభ్యర్థులు లేరని అన్నారు. అంతే కాకుండా బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపుర, కోలారు, హాసన్, మండ్య, రామనగర జిల్లాలతో పాటు దక్షిణ కర్ణాటకలో విజయం సాధించే బీజేపీ నాయకుడే లేరని సిద్దరామయ్య అన్నారు.
జేడీఎస్ ప్రభావం ఉండదు
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ప్రభావం ఐదు లేదా ఆరు జిల్లాలో మాత్రమే ఉంటుందని సిద్దరామయ్య చెప్పారు. అంతే కాని కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి ఎదురుగాలే వీస్తోందని, ఆపార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో వారికే తెలీదని సీఎం సిద్దరామయ్య అన్నారు.
ఆర్ ఎస్ఎస్, బజరంగ్ దళ్
ఆర్ ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ కారణంగానే ఉత్తర కన్నడ జిల్లాల్లో మత ఘర్షణలు జరుగుతున్నాయని, వారి కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. మధ్యలో దళితులు, బీసీ వర్గాలకు చెందిన యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని సిద్దరామయ్య చెప్పారు.
మా సర్వేలు మాకు ఉన్నాయి
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఎవ్వరికీ సంపూర్ణ మెజారిటీ రాదని పలు సర్వేలు చెప్పాయి కదా అని ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య తనదైన శైలిలో సమాదానం ఇచ్చారు. ఏఐసీసీ సర్వే చేసిందని, తానుకూడా సర్వే చేయించానని శాసన సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో తాము అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే ప్రశ్నే ఎదురుకాదని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.