బీజేపీ ద్రోహం చేసింది, మేము చెప్పింది చేస్తాం, మేనిఫెస్టోలో హామీలు, రాహుల్ గాంధీ !
మంగళూరు/ బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతామో, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతామో అనే హామీలతో రూపోందించిన మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మంగళూరులోని టీఎంఎ పై కన్వెన్షన్ హాల్ లో విడుదల చేశారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ దేశానికి ద్రోహం చేసిందని ఆరోపించారు.
నాలుగు గోడల మధ్య కాదు
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నాలుగు గోడల మధ్య నలుగురు కుర్చుని తయారు చెయ్యలేదని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించామని, వారి అవసరాలు ఏమిటి అని తెలుసుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశామని రాహుల్ గాంధీ వివరించారు.
ప్రభుత్వం ఏమి చెయ్యాలి
ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు, మీ అవసరాలు ఏమిటీ, మీ సమస్యల పరిష్కారం కోసం మేము ఏమి చెయ్యాలి అని ప్రజలను అడిగి తెలుసుకుని ఈ మేనిఫెస్టో తయారు చేశామని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కర్ణాటక మన్ కీ బాత్ (కన్నడిగుల ధ్వని) అని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ మేనిఫెస్టో మోడీ మాన్ కీ బాత్
కర్ణాటక ప్రజలు బీజేపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే అది కేవలం ముగ్గురు, నలుగు తయారు చేసిందని తెలిసిపోతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మేనిఫెస్టోలో అవినీతి ఉందని, గాలి జనార్దన్ రెడ్డి సోదరుల అవసరాలు ఉన్నాయని, ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే తాము ప్రజల అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకుని మేనిఫెస్టో తయారు చేశామని రాహుల్ గాంధీ అన్నారు.
90 శాతం పూర్తి చేశాం
గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేశామని, బసవణ్ణ ఆశయాలకు అనుగుణంగా మేము ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు పూర్తి చేశామని, ఇప్పుడు ఇచ్చిన హామీలు వంద శాతం పూర్తి చేస్తామని, అధికారంలోకి రావడానికి మీరు ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ కన్నడిగులకు మనవి చేశారు.
బీజేపీ ద్రోహం చేసింది
గత లోక్ సభ ఎన్నికల సందర్బంగా ప్రతి కుటుంబ సభ్యుడి బ్యాంక్ అకౌంట్ లో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే తాము ఇచ్చిన అన్ని హామీలను కర్ణాటకలో 90 శాతం పూర్తి చేశామని రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.
కన్నడిగుల అభిమానం
కర్ణాటకను ఇప్పుడు సిలికాన్ వ్యాలీగా పోల్చుతున్నారని, కర్ణాటకకు దేశ, విదేశాలను నుంచి లక్షల మంది వస్తుంటారని, వారందరిని కన్నడిగులు సోదరులుగా చూసుకుంటారని, ప్రేమాభిమానాలతో వారి యోగక్షేమాలు చూసుకుంటారని, అందుకే తనకు ఇక్కడికి రావాలన్నా, ఉండాలన్నా చాల ఇష్టమని రాహుల్ గాంధీ చెప్పారు.
కన్నడిగులకు జై
ఇతర ప్రాంతాల ప్రజలను ఆదరించే కన్నడిగులను నేను అభినంధిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, ఎంపీ. వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనార్దన్ పూజారి తదితరులు పాల్గొన్నారు.