కర్నాటక అసెంబ్లీలో మతమార్పిడుల బిల్లుకు ఆమోదం- చిక్ బళ్లాపూర్ లో చర్చి ధ్వంసం
కర్నాటకలో మత మార్పిడుల్ని నిరోధించే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. మత మార్పిడి నిరోధక బిల్లుగా పేర్కొంటున్న కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లుకు అసెంబ్లీ ఇవాళ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళనల మధ్య శాసనసభలో మూజువాణి ఓటు ద్వారా దీన్ని ఆమోదించారు.
కాంగ్రెస్ ఈ బిల్లును క్రూరమైనదని, మానవ వ్యతిరేకమైనదిగా అభివర్ణించింది. ఇది ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ప్రవేశపెట్టారని ఆరోపించింది. కర్నాటక మత స్వాతంత్ర్య హక్కుల పరిరక్షణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేకించేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమవుతున్న తరుణంలో కూడా కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2016లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తరహాలో బిల్లు ముసాయిదాను రూపొందించినట్లు అధికార బీజేపీ పత్రాలను బయటపెట్టింది.
ఈ బిల్లులోని ముఖ్యాంశాలను వివరిస్తూ, అప్పటి ప్రభుత్వ సలహా మేరకు కర్ణాటక లా కమీషన్ మత స్వేచ్ఛ హక్కు బిల్లు తరహాలో కర్నాటక లా కమిషన్ ముసాయిదా బిల్లును తయారు చేసిందని న్యాయశాఖ మంత్రి జె.సి.మధుస్వామి సమర్థించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అందించిన పత్రాలను స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి ప్రస్తావిస్తూ, సాంఘిక సంక్షేమ శాఖ సలహా మేరకు కర్ణాటక లా కమిషన్ ముసాయిదా బిల్లును సిద్ధం చేసిందని చెప్పారు. నవంబర్ 16, 2016న అప్పటి న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర ఈ బిల్లును పరిశీలించారు.
తర్వాత అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్ద రికార్డులను ఉంచారు. ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, బిల్లును కేబినెట్ ముందు ఉంచలేదని ఆయన అసెంబ్లీకి తెలిపారు. అయితే తాను అలాంటి పత్రంపై సంతకం చేయలేదని సిద్ధరామయ్య ఎదురుదాడి చేశారు. అటువంటి ముసాయిదా బిల్లును తయారు చేయలేదని శ్రీ జయచంద్ర తనతో చెప్పారని ఆయన పట్టుబట్టారు.పత్రాల్లోని విషయాలను సరిచూసేందుకు సిద్ధరామయ్య, న్యాయశాఖ మంత్రి జె.సి.మధుస్వామిని తన ఛాంబర్కు ఆహ్వానించడానికి ముందు స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.
పత్రాల పరిశీలన తర్వాత, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ముసాయిదా బిల్లును తయారు చేసినట్లు శ్రీ సిద్ధరామయ్య సభలో అంగీకరించారు. అయితే, తమ ప్రభుత్వం ముసాయిదా బిల్లును కేబినెట్ ముందు ఉంచలేదని ఆయన స్పష్టం చేశారు. మేము ముసాయిదా బిల్లుతో ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ప్రస్తుత బిల్లును ప్రవేశపెట్టేందుకు మేమే రంగం సిద్ధం చేశామని చెప్పి మమ్మల్ని నిందించడం సరికాదని ఆయన వాదించారు. బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రస్తుత బిల్లుకు తమ ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ నిరసనకు దిగింది. నిరసనల మధ్యే సభ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది.
అదే సమయంలో చిక్ బళ్లాపూర్ లో ఓ చర్చిని ఆగంతకులు ధ్వంసం చేశారు. కర్ణాటకలోని దక్షిణ జిల్లా చిక్కబల్లాపూర్లో గురువారం గుర్తుతెలియని దుండగులు చర్చిని ధ్వంసం చేశారు. దుండగులు అద్దాలు పగలగొట్టి సెయింట్ ఆంథోనీ విగ్రహాన్ని పగలగొట్టారని పోలీసులు తెలిపారు. చర్చి అధికారులకు ఫిర్యాదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.