కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి షాక్: మంత్రి పదవికి బీఎస్పీ ఎమ్మెల్యే రాజీనామా
బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. బీఎస్పీ ఎమ్మెల్యే, ప్రాథమిక, సెకండరీ విద్యాశాఖ మంత్రి ఎన్ మహేశ్ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
బహుజన్ సమాజ్వాది పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మహేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మాయావతి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మాయావతి ఆదేశాల మేరకు కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం నుంచి తాను తప్పుకున్నట్లు మహేశ్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కులాలు, అసమానతలు తొలగినప్పుడే బహుజనులుఅధికారంలోకి వస్తారని అన్నారు.