కర్ణాటక ప్రభుత్వం మంత్రి పదవులు, తగ్గిన కాంగ్రెస్, నెగ్గిన జేడీఎస్, రాజీనామా చేస్తా: సీఎం!
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యడానికి సర్వం సిద్దం అవుతోంది. ఇప్పటికే జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రిత్వ శాఖల పంపిణి విషయంలో ఓనిర్ణయానికి వచ్చారని వెలుగు చూసింది. రెండు కీలక శాఖల పంపిణి విషయంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయని ఒన్ ఇండియాకు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజీనామా చేస్తానని సీఎం బెదిరించడంతో కాంగ్రెస్ తగ్గింది.
రెండు కీలక శాఖలు
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రెండు కీలక శాఖల పంపిణి విషయంలో ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులామ్ నబి ఆజాద్, సిద్దరామయ్య, డాక్టర్ జి. పరమేశ్వర్ తో చర్చలు జరిపి రెండు కీలక శాఖల పంపిణి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు.
సీఎం రాజీనామా
ఆర్థిక శాఖ, హోం శాఖ పంపిణి విషయంలో ఇరుపార్టీల నాయకులు పట్టుబట్టారు. ఈ రెండు శాఖల పంపిణి విషయంలో ఇరు పార్టీల నాయకులు వెనక్కి తగ్గలేదు. ఆర్థిక శాఖ తనకు అప్పగించకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని గులామ్ నబి ఆజాద్ ఇంటిలో కుమారస్వామి కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించారని సమాచారం.
తగ్గిన కాంగ్రెస్, నెగ్గిన జేడీఎస్
కుమారస్వామి రాజీనామా బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనక్కి తగ్గింది. ఆర్థిక శాఖను జేడీఎస్ కు అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగీకరించారు. జేడీఎస్ కు ఆర్థిక శాఖ ఇచ్చి హోం శాఖను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది.
మంత్రి పదవులు పంపిణి
కాంగ్రెస్ పార్టీకి భారీ పరిశ్రమల శాఖ, ఐటీ/బీటీ శాఖ, శిక్షణ, పర్యాటక శాఖలు ఇవ్వడానికి జేడీఎస్ అంగీకరించింది. ఇక పీడబ్ల్యూ శాఖ, సహకార శాఖ, రెవెన్యూ శాఖ జేడీఎస్ కు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగీకరించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు మంత్రి వర్గం ఏర్పాటుకు ముందే పదవుల కోసం ఒకరి మీద ఒకరు పట్టుబడుతున్నారు. జేడీఎస్ కు సీఎంతో పాటు 12 మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రితో పాటు 22 మంత్రి పదవులు కాంగ్రెస్ తీసుకుంటున్నాయి.
రైతుల రుణమాఫీలు
రూ. 50 వేల కోట్లకు పైగా ఉన్న రైతుల రుణమాఫీలు చెయ్యాలంటే ఆర్థిక శాఖ తన దగ్గరే ఉండాలని హెచ్.డి. కుమారస్వామి పట్టుబట్టారని తెలిసింది. రెండు విడతల్లో రైతుల రుణమాఫీ చెయ్యాలని సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రైతుల రుణమాఫీలు చెయ్యడానికి 15 రోజులు సమయం కావాలని సీఎం కుమారస్వామి బుధవారం విధాన సౌధలో చెప్పిన విషయం తెలిసిందే.