కర్ణాటక సీఎం కుమారస్వామి క్షేమం: ఆరు నెలలు కుర్చీ, ప్రతిపక్షం వాకౌట్, ఎమ్మెల్యేలు ఇంటికి !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి శాసన సభలో బలపరీక్షలో విజయం సాధించారు. శుక్రవారం విధాన సౌధలో బలపరీక్షకు ముందే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ప్రతిపక్షం వాకౌట్ చెయ్యడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతానికి గట్టెక్కింది. ఆరు నెలలు సీఎం కుర్చికి ఎలాంటి ఢోకా లేదు. బలపరీక్ష పూర్తి కావడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తున్నారు.
స్పీకర్ కు ధన్యవాదాలు
శుక్రవారం 12.15 గంటల సమయానికి కర్ణాటక శాసన సభ ప్రారంభం అయ్యింది. కర్ణాటక స్పీకర్ గా శ్రీనివాసపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్. రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అనంతరం సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే. శివకుమార్ తదితరులు రమేష్ కుమార్ ను అభినందించారు.
కుమారస్వామి ఒకే
స్పీకర్ ఎన్నిక పూర్తి అయిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ తాను శాసన సభలో ఎమ్మెల్యేల బలపరీక్షకు సిద్దమని, తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ కు మనవి చేశారు.
మోడీ, బీజేపీపై విమర్శలు
కర్ణాటక శాసన సభలో హెచ్.డి. కుమారస్వామి తాను గతంలో 20 నెలల పాటు ముఖ్యమంత్రిగా పని చేశానని పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మీద విమర్శలు చేశారు. ఐటీ, ఈడీ దాడులకు తాము భయపడమని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని కుమారస్వామి హెచ్చరించారు.
తండ్రి, కొడుకుల పార్టీ
ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప మాట్లాడుతూ జేడీఎస్ తండ్రి, కొడుకుల పార్టీ అని ఆరోపించారు. కుళ్లు రాజకీయాలు చెయ్యడంలో వీళ్లు ముందు వరసలో ఉంటారని, అధికారం కోసం ఏమైనా చేస్తారని, ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. ఆ సందర్బంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్.డి. రేవణ్ణ జోక్యం చేసుకుని యడ్యూరప్పతో వాగ్వివాదానికి దిగారు.
కుమారస్వామి క్షేమం
బీఎస్. యడ్యూరప్పతో సహ 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ శాసన సభ నుంచి వాకౌట్ చేశారు. తరువాత స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ బలపరీక్ష నిర్వహించడంతో జేడీఎస్, కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. కుమారస్వామి ప్రస్తుతానికి బలపరీక్ష నుంచి బయటపడటంతో కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగనుంది.