ఈరోజు సాయంత్రం సీఎం సిద్దరామయ్య రాజీనామా, ఊహించని షాక్, చాముండేశ్వరిలో ఓటమి!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడుతున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రివర్స్ అయ్యాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఊహించనిదానికంటే షాక్ ఇచ్చారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచానా వేసిన రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు షాక్ తిన్నారు.
బీజేపీ దెబ్బకు కాంగ్రెస్!
మంగళవారం మద్యాహ్నం 12.30 గంటల ట్రెండ్ ప్రకారం బీజేపీ 114, కాంగ్రెస్ 68, జేడీఎస్ 38 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. విజయం మాదే అని ఇంత కాలం ధీమాగా ఉన్న సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అయోమయంలో పడిపోయింది.
సీఎం సిద్దూకు షాక్!
మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసిన సీఎం సిద్దరామయ్య స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే, జేడీఎస్ పార్టీ నాయకుడు జీటీ. దేవేగౌడ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందరూ ఊహించినట్లే సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి నియోజక వర్గంలో ఓడిపోయారు.
సీఎం ఇంటిలో కాంగ్రెస్ పెద్దలు
మంగళవారం మద్యాహ్నం సీఎం సిద్దరామయ్యకు చెందిన కావేరి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భేటీ అయ్యి చర్చించుకుంటున్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, అశోక్ గోహ్లట్ తదితరులు సీఎం సిద్దరామయ్యతో చర్చలు జరుపుతున్నారు.
సీఎం రాజీనామా!
మంగళవారం సాయంత్రం సీఎం సిద్దరామయ్య రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ కు రాజీనామా సమర్పించడానికి సిద్దం అయ్యారని తెలిసింది. బాగల్ కోటే జిల్లా బాదామి నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు కంటే స్పల్ప ఆధిక్యంలో సీఎం సిద్దరామయ్య గట్టిపోటీ ఇస్తున్నారు.