ఓటు మోడీకి వేసి.. సాయం నన్ను అడుగుతారా.. మరో వివాదంలో కర్ణాటక సీఎం
బెంగళూరు : కర్ణాటక సీఎం కుమారస్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా గ్రామాల్లో బస పేరిట పల్లెలను చుట్టొస్తున్న కుమారస్వామికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నాడు రాయచూర్ నుంచి కర్రెగుడ్డకు ప్రయాణించే సమయంలో ఆయన బస్సును కొందరు అడ్డగించారు. దాంతో ఒక్కసారిగా సహనం కోల్పోయారు కుమారస్వామి.
తమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓపిక నశించి వారి మీద అరవడం మొదలుపెట్టారు.
Recommended Video


ఓట్లేమో మోడీకి ఓటేసి నన్ను సాయమడుగుతారా అంటూ రెచ్చిపోయారు. ఒక ముఖ్యమంత్రిగా నేను మీకు మర్యాద ఇస్తున్నాను కాబట్టే ఇంతసేపు ఓపిక పట్టాను. దారి వదులుతారా లేదంటే లాఠీఛార్జి చేయించమంటారా అంటూ ఊగిపోయారు. అలా కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కుమారస్వామి బెదిరింపులకు ప్రజలు ఏమాత్రం జంకలేదు. దాంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని జనాలను చెదరగొట్టాల్సి వచ్చింది. దాంతో కుమారస్వామి ప్రయాణానికి రూట్ క్లియరైంది.
కుమారస్వామి జనాలతో మాట్లాడిన తీరుకు సంబంధించిన విజువల్స్ టీవి ఛానళ్లలో ప్రసారం కావడంతో విపక్ష నేతలకు అస్త్రం దొరికినట్లైంది. దాంతో ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలతో మాట్లాడే పద్దతి అదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. విచక్షణ మరచిపోయి కుమారస్వామి అలా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications