బాహుబలి టికెట్ ధర: సిద్ధరామయ్యపై విమర్శలకు కారణం ఇదీ...
సినిమా టికెట్ రూ.200కు మించరాదనే నిబంధన తేవడానికి సిద్ధపడిన సిద్ధరామయ్య తానే 1000 రూపాయలకు పైగా చెల్లించి బాహుబలి సినిమా చూశారు.
బెంగళూరు: బాహుబలి మానియా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా వదలలేదు. ఆయన అధిక ధర చెల్లించి టికెట్ కొని బాహుబలి - 2 సినిమా చూశారు. సినిమా టికెట్ ధర రూ.200 మించకూడదని ఆయనే అసెంబ్లీ సాక్షిగా నిబంధన పెట్టారు.
ఆయన పెట్టిన నిబంధనను ఆయనే కాలరాశారు. తాను, తన కుమారుడు, మనుమలు ఇలా ఓ 40 మంది పరివారంతో ఆయన ఈ సినిమా చూశారు. ఒక్కో టికెట్కు ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.1050. అంటే ఆయన పెట్టిన పరిమితికి ఐదు రెట్లు ఎక్కువన్న మాట.
బెంగళూరులోని ఓరియన్ మాల్లోని గోల్డెన్ క్లాస్లో సాధారణ పబ్లిక్తో కలిసి ఆయన సినిమా చూశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన మనుమలు కచ్చితంగా సినిమా చూడాలని ఒత్తిడి చేయడంతో సిద్ధరామయ్య తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

నిబంధన పెట్టినా...
సినిమా టికెట్ ధర రూ.200 మించకూడదనే నిబంధనను ఈ ఏడాది బడ్జెట్లో పెట్టినా కూడా దాన్ని ఇంకా అమల్లోకి తేలేదు. ఈ లోపలే స్వయంగా ముఖ్యమంత్రే ఇలా ఐదు రెట్లు ఎక్కువ ధర చెల్లించి సినిమా చూడటం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.

నో కామెంట్..
టికెట్ ధరకు పరిమితి విధించాలని ఒత్తిడి తీసుకొచ్చిన కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక చలనచిత్ర అకాడమీ మాత్రం సిద్ధరామయ్య ఎక్కువ ధర పెట్టి టికెట్ కొనడంపై స్పందించడానికి నిరాకరించాయి. దానికి తోడు టికెట్ ధర పరిమితి ఫైలుపై సంతకం చేయడం విషయంలోనూ సిద్దరామయ్యే కావాలనే నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వున్నాయి.

గత గురువారమే చేయాలి...
గత గురువారమే ఆయన టికెట్ ధరపై పరిమితి విధిస్తూ ఫైలుపై సంతకం చేయాల్సి ఉంది. అయితే ఆయన దుబాయ్కు వెళ్లారు. ఈలోపు బాహుబలి సినిమా విడుదల అయింది. థియేటర్ల ఓనర్లు తమ ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. అలా సిద్ధరామయ్య అధిక ధరకు టికెట్ కొన్న వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది.

సంతకం చేస్తారేమో..
బాహుబలి సినిమా లాభాలను సంపాదించుకున్న తర్వాత మంగళవారం ఈ ఫైలుపై సిద్ధరామయ్య సంతకం చేసే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. నిజానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచే టికెట్ ధరలపై పరిమితి విధించిన నిబంధన అమలులోకి రావాల్సి ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 27వ తేదీ నుంచి అమలులోకి తెస్తామని చెప్పారు. కానీ అదీ జరగలేదు.

యాభై టికెట్లు కొన్నారు...
సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్ర, మనువడు వికాస్ ఓరియన్ మాల్ బెంగుళూరులో సినిమా చూశారు. విజయ్ కర్ణాటక కథనం ప్రకారం - ముఖ్యమంత్రి బృందానికి 50 టికెట్లు కొన్నారు. మొత్తం 48 మంది ఆయనతో పాటు సినిమా చూశారు. వారిలో కెపిసిసి అధ్యక్షుడు జి. పరమేశ్వర, మంత్రి రోషన్ బేగ్ కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications